1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (12:50 IST)

రేపు ఉదయం వరకు తిరుమల కనుమదారులు మూసివేత

తిరుమలలో భారీ వ‌ర్షంతో అన్ని దారులు మూసివేశారు. ఈశాన్య రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల కనుమదారులను మూసివేస్తున్నట్టు తితిదే ప్రకటించింది. 
 
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రెండు కనుమదారుల్లో చెట్లు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. సాయంత్రం నుంచి వర్షం ఉద్ధృతి మరింత పెరగడంతో కనుమదారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. రెండో కనుమదారిలో 14వ కిలోమీటరు వద్ద, దిగువ ఘాట్‌ రోడ్‌లో రెండో మలుపులో రహదారిపై బండరాళ్లు పడ్డాయి. జేసీబీల సాయంతో బండరాళ్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కనుమదారుల్లో మరింతగా కొండ చరియలు పడే అవకాశం ఉండటంతో రాత్రి 8గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకు ఘాట్‌ రోడ్లను మూసివేయనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు. 

 
భారీ వర్షాల కారణంగా తిరుమలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాత్రి 7.30 గంటల నుంచి బస్‌ టికెట్ల జారీ నిలిపివేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.