గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (06:51 IST)

11,501 మంది ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దు బ‌దిలీ: మంత్రి కొడాలి నాని

సొంత ఆటోరిక్షా, మోటారు క్యాబ్, మాక్సీ కాబ్ కలిగి డ్రైవర్ కం ఓనర్ల‌కు వైయస్ఆర్ వాహనమిత్ర పధకం ద్వారా వారి బ్యాంకు ఖాతాలకు రూ.10 వేలు చొప్పున జమ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.

మంత్రి మాట్లాడుతూ అర్హత ఉండి ప్రభుత్వ పధకం లబ్ధి చేకూరని లబ్దిదారులకు నిరాశ కలగకుండా సహకారం అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 4న వైయస్సార్ వాహనమిత్ర ద్వారా 2,61,975 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక చేయూతను నగదు బదిలీ చేశామ‌న్నారు.

అర్హత ఉండి వై.యస్.ఆర్. వాహన మిత్ర పధకం ప్రయోజనం పొందని లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వివరాలు సేకరించి కలెక్టర్ల ఆమోదంతో మరో 11,501 మంది లబ్ధిదారులను గుర్తించామని, వారి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీని చేసిన‌ట్లు తెలిపారు.

గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే అర్హులకు పధకాలు అందించడంలో పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా పధకాల ప్రయోజనాన్ని పేదలకు అందించారన్నారు. అదే తరహాలో అంతకు మించి సీఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా కరోనా వంటి విపత్తు సమయంలో కూడా ప్రజలకు ఆర్థికంగా, అండగా నిలుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

వైయస్ఆర్ వాహనమిత్ర ద్వారా డ్రైవరు కం ఓనర్ గల వాహన యజమానులకు వాహనాల నిర్వాహణ, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, తదితర ఖర్చుల కోసం ఆర్ధికంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. 

గత ఆర్ధిక సంవత్సరంలో 2,24,219 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చగా, ఈ ఏడాది క్రొత్తగా మరో 49,257 మందికి లబ్ది చేకూర్చడం జరిగిందని మంత్రి కొడాలి నాని అన్నారు.

గతేడాది అక్టోబరు 4న వైయస్ఆర్ వాహనమిత్ర నగదు బదిలీ పధకాన్ని అమలు చేశారని, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 4నెలల ముందే జూన్ 4న పధకం ప్రయోజనాన్ని డ్రైవర్ల ఖాతాకు జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.