శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 5 జనవరి 2022 (10:34 IST)

ప్ర‌వాస భార‌తీయురాలితో వివాహేతర సంబంధం... హత్య!

వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానిక శ్రీనివాస నగర్ కు  చెందిన సీహెచ్ సునీల్ కాళేశ్వరీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. అతడి భార్య నగరంలో ప్రముఖ ప్రవైట్ స్కూల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. సునీల్ నగర వైఎస్సార్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు.
 
 
అతడికి బొమ్మురుకు చెందిన స్వీటీ అనే ప్రవాస భారతీయురాలు చాలాకాలంగా స్నేహితురాలు. ఆమె భర్త  డెన్వర్  సౌదీ అరేబియాలోని అబుదాబీలో  ఉద్యోగం చేస్తుంటాడు. అతడితో కూడా సునీల్ కు పరిచయం వుంది. అయితే స్వీటితో సునీల్ సన్నిహితంగా వుంటున్నట్లు గా  డెన్వర్ అనుమాన పడుతున్నాడు.  ఈ విషయంలో సునీల్ ను డెన్వర్ హెచ్చరించడం, దీంతో  వారి మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. 
 
 
వారం రోజుల క్రితం అబుదబీ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన డెన్వర్ మంగళవారం ఉదయం సునీల్ కు ఫోన్ చేసి అతడి ఇంటికి వస్తున్నట్లు తెలిపాడు.  ప‌ది గంట‌ల సమయంలో డెన్వర్ అతడి భార్య స్వీటీ  సునీల్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కడే వున్నాడు. సుమారు రెండు గంటల పాటు వారి మధ్య వాగ్వివాదం జరిగినట్టు చుట్టు పక్కల వారు చెపుతున్నారు. తర్వాత డెన్వర్, స్వీటీ హడావిడిగా కేకలు వేసుకుంటూ వెళ్ళిపోవడంతో  అనుమానం వచ్చిన స్థానికులు వెళ్ళి చూడగా సునీల్ కత్తి పోట్లకు గురైన స్థితిలో రక్తపు మడుగులో మంచంపై పడి ఉన్నాడు. 
 
 
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ప్రకాష్ నగర్  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వీటీ, డెన్వర్ లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.