శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (18:03 IST)

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్ మంజూరు

Kothapalli Geetha
నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేసిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వర రావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తును సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి, తదుపరి విచారణను డిసెంబరు 16వ తేదీకి వాయిదావేసింది. 
 
నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకును మోసం చేసి కోట్లాది రూపాయల మోసం చేశారన్న అభియోగాలు నిరూపితం కావడంతో కొత్తపల్లి గీతకు ఇప్పటికే సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది.
 
ఇదిలావుంటే, ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42 కోట్లు మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు, తదితరులను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావు డైరెక్టర్లుగా ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. 
 
బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొంది వాటిని ఇతర అవసరాలకు దారి మళ్లించి మోసం చేశారన్నది ప్రధాన అభియోగం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు కొత్తపల్లి గీత, పి.రామకోటేశ్వరరావు, విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు బీకే జయప్రకాశన్‌, కేకే అరవిందాక్షన్‌, డాక్యుమెంట్లు తయారు చేసిన ఎస్.రాజ్‌కుమార్‌పై బెంగళూరులోని సీబీఐ బ్యాంకింగ్ నేరాల విభాగం కేసు నమోదు చేసింది. 
 
దర్యాప్తు చేసి నిందితులపై 2015లో హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. వివిధ సెక్షన్ల ప్రకారం నిందితులందరూ నేరానికి పాల్పడినట్లు తేలుస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించిన కోర్టు.. వారితో పాటు బ్యాంకు అధికారులు జయప్రకాశన్‌, అరవిందాక్షన్‌కూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
విశ్వేశ్వర ఇన్‌ఫ్రాకు రూ.2 లక్షల జరిమానా విధించింది. కోర్టు జైలు శిక్ష విధించడంతో వెంటనే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి గీత అస్వస్థతకు గురికావడంతో నిన్న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చించారు. శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మిగతా నలుగురు (పి.రామకోటేశ్వరరావు, బీకే జయప్రకాశన్‌, కేకే అరవిందాక్షన్‌, ఎస్.రాజ్‌కుమార్‌) చంచల్‌గూడ జైలులో ఉన్నారు.