ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (14:28 IST)

టీటీడీ లీగల్ అధికారి కొనసాగింపుపై హైకోర్టులో విచారణ

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం లీగల్ అధికారిగా రెడ్డప్పరెడ్డి నియమించడాన్ని సవాల్‌ చేస్తూ, దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచార‌ణ సందర్భంగా అత్యున్న‌త‌ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. లీగల్ ఆఫీసర్​గా రెడ్డెప్పరెడ్డి నియామకంపై వివరాలు సమర్పించాలని తితిదే ఈవోను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. 
 
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తితిదే లా ఆఫీసర్ గా విశ్రాంత న్యాయాధికారి రెడ్డెప్ప రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ బి.దొరస్వామి హైకోర్టులో పిల్ వేశారు. తితిదే తరపు న్యాయవాది పి.మహేశ్వరరావు వాదనలు వినిపించారు. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిన నేపథ్యంలో వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. 
 
 
విశ్రాంత న్యాయాధికారిని తితిదేలా ఆఫీసర్​గా నియమించడం 2020 జనవరి 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో 16కు విరుద్ధం అని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.  సర్వీసులో ఉన్న న్యాయాధికారినే లా ఆఫీసర్​గా నియమించాలన్నారు. లా ఆఫీసర్ రెడ్డెప్పరెడ్డి పదవీ కాలం వచ్చే డిసెంబర్ 6వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలన్నారు.
 
 
ఆ వాదనలపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. 2019 డిసెంబర్లో ఈ నియామకం జరిగితే, ఇప్పుడు వ్యాజ్యం దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. నియామకం జరిగి రెండేళ్లు కావస్తుంటే.. ఇప్పటి వరకు ఎందుకు వ్యాజ్యం దాఖలు చేయలేదన్న కోర్టు, త్వరగా విచారణ జరపాలని ఒత్తిడి చేస్తే వ్యాజ్యాన్ని కొట్టేస్తామని హెచ్చరించింది. తితిదే తరపు న్యాయవాది అభ్యర్ధన మేరకు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.