1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 19 ఆగస్టు 2021 (16:30 IST)

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం, ఏమైంది?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు చిన్నపాటి గాయమైంది. విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాలులో ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ తలకు కార్ డోర్ తగిలింది. దీంతో ఫస్ట్ ఎయిడ్ అనంతరం తన పర్యటన కొనసాగించారు కేంద్ర‌మంత్రి.
 
అంతకుముందు ఆయన మాట్లాడుతూ... విజయవాడతో తనకు అవినాభావ సంబంధం ఉందని, నేడు కేంద్ర మంత్రిగా ఇక్కడి రావడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం... ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు.
 
తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి విజయవాడ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడలో వేదిక కన్వెన్షన్ హాల్ లో జన ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. అత్యధికంగా 27 మంది బీసీలు ఉన్న కేంద్ర మంత్రి వర్గంలో తాను ఉండటం గర్వకారణమని కిషన్ రెడ్డి చెప్పారు.
 
ప్రధాని మోదీ ఆదేశానుసారం జన ఆశీర్వాద యాత్ర చేస్తున్నామని, దేశం కోసం బలిదానం చేసిన వారిని స్మరిస్తూ, ఆజాదీ కా అమృత్ వర్ష్ జరుపు కొంటున్నామని చెప్పారు. దేశ ప్రజలంతా విధిగా మాస్క్ ధరించి, అంతా కోవిడ్ నియమాల్ని పాటిస్తే, మూడో వేవ్ రాదని కిషన్ రెడ్డి సూచించారు.
 
ప్రధాని మోదీ అవినీతి లేని పాలన అందిస్తున్నారని, పేదలకు గృహ నిర్మాణం చేపడుతున్నామని, అలాగే 80 కోట్ల మందికి కేజీ 3 రూపాయల బియ్యం కేంద్రం అందిస్తోందని, కరోనా సమయంలో అది కూడా ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తామన్నారు.