1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 జులై 2025 (21:21 IST)

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

couple
ప్రియురాలిని కలుసుకునేందుకు ఆ యువకుడు అర్థరాత్రి వేళ తచ్చాడుతూ వెళ్తున్నాడు. తనను ఎవరో గమనిస్తున్నారని తెలుసుకుని ఆ యువకుడు చెట్ల చాటున నక్కాడు. అంతే... గ్రామస్తులంతా ఒక్క ఉదుటన అతడిపై బడి చితక్కొట్టారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో అర్థరాత్రి వేళ సురేష్ అనే యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చాడు. ఐతే అతడు తన ప్రియురాలిని కలిసేలోపుగా అతడు కొంతమంది గ్రామస్తుల కంటబడ్డాడు. దాంతో ఊరు ఊరంతా కదిలివచ్చింది. అతడు దొంగ అనుకుని వెంటబడ్డారు. ఆ యువకుడు భయంతో ముళ్లపొదల్లో దాక్కున్నాడు.
 
గ్రామస్తులంతా ముళ్లపొదల్లో నక్కిన యువకుడిని బైటకు లాగి సమీపంలో వున్న కరెంట్ స్తంభానికి కట్టేసి అర్థరాత్రి వేళ ఎందుకొచ్చావని ప్రశ్నించారు. తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానని చెబితే పరిస్థితి మరింత దిగజారుతుందని అతడు నోరు మెదపలేదు. దాంతో అంతా కలిసి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానంటూ ఆ యువకుడు పోలీసుల వద్ద బావురుమంటూ ఏడ్చాడు. పోలీసులు అతడికి పలు ప్రశ్నలు వేసి... అతడు నిజంగానే ప్రియురాలి కోసం వచ్చాడని నిర్థారించి, ఆసుపత్రికి పంపించారు.