1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (19:04 IST)

ఒకేసారి ముగ్గురితో ప్రేమాయణం.. భర్తను కిడ్నాప్ చేయబోతే.. బాత్రూమ్‌లో కేకలు?

ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడింది ఓ యువతి. అంతేగాకుండా ఒక బాయ్‌ఫ్రెండ్ పెళ్లికి నో చెప్పి.. మరో ప్రేమికుడిని వివాహం చేసుకుంది. దీంతో తాను మోసపోయిన విషయాన్ని లేటుగా గ్రహించిన యువకుడు.. ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పీఎం పాలేం గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీని నడుపుతున్నాడు. 
 
ఈ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే 27 ఏళ్ల రేవతితో అతని స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. అయితే రేవతి, బాస్‌తో పాటు విజినిగిరిపాలేం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడితో కూడా ప్రేమాయణం సాగించేది. ఒకరికి తెలియకుండా మరోకరితో ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో ప్రేమాయణం నడిపింది. 
 
పెళ్లి వయసు రావడంతో ముందుగా కంపెనీ ఎండీ అయిన శివప్రసాద్‌‌ను పెళ్లి చేసుకోవాలని కోరింది రేవతి. దానికి శివప్రసాద్ ఇంకా సమయం కావాలని కోరాడు. దానికి ఆగ్రహానికి లోనైన రేవతి, సుబ్రహ్మణ్యాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు లేఖ రాసి, సుబ్రహ్మణ్యంతో వెళ్లిపోయింది. 
 
దాంతో తనను మోసం చేసిన రేవతిపై కక్ష పెంచుకున్నాడు శివప్రసాద్. తన ఆఫీసులోనే పనిచేస్తున్న రేవతి అన్న వెంకటసాయి సాయంతో రేవతినీ, ఆమె భర్త సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేయాలని పథకం పన్నారు. తన ఆఫీసులో నగలు, ల్యాప్‌టాప్ చోరీకి గురయ్యాయని, వాటిని రేవతియే అపహరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
వారు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఓ వాహనానికి పోలీస్ అనే స్టిక్కర్ అంటించి.. కిరాయి మనుషులను రేవతి ఇంటికి పంపాడు శివప్రసాద్. ఈ విషయం తెలియకుండా పోలీస్ బండి అనుకుని రేవతి అతని భర్త ఆ వాహనం ఎక్కారు. కానీ దారిలో ప్లాన్ కనిపెట్టిన రేవతి.. బాత్రూమ్‌కు వెళ్లాలని గోల చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఆపాలని పట్టుబట్టింది. ఆమె మాటలు నమ్మిన వాళ్లు బండిని పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. 
 
బండి దిగి బాత్రూమ్‌కు వెళ్లిన రేవతి, ఆమె భర్త గడియ పెట్టుకుని కాపాడాలంటూ కేకలు వేశారు. స్థానికులు గుమిగూడడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.