శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 29 జనవరి 2020 (21:37 IST)

విశాఖ తుఫానుల తాకిడి ప్రాంతమే, అయినా ఫర్వాలేదు, రాజధాని అక్కడే: బొత్స కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ తెదేపాపై ధ్వజమెత్తారు. ఆయన మాటల్లోనే... నిన్నటి వరకూ జిఎన్ రావు, బోస్టన్ గ్రూప్ నివేదికలు చెత్త, తప్పులతడక, బోగస్ అన్నారు.. బోగిమంటల్లో కాల్చారు. ఇవాళ వారి రిపోర్ట్‌లో విశాఖ రాజధానికి అనుకూలం కాదు అని చంద్రబాబు, పచ్చ పత్రికలు అంటున్నాయి. ఏదయినా మాట్లాడేప్పుడు పరిశీలించి, ఆలోచించి మాట్లాడాలి. అప్పుడే విలువ ఉంటుంది.
 
నిపుణులతో కూడిన కమిటీల నివేదికలు పరిశీలించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. వైజాగ్ సైక్లోన్ ప్రభావిత ప్రాంతమే అయినా ప్రమాదం లేదు. ముంబై, చెన్నైలు కూడా సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలే. వైజాగ్‌లో ల్యాండ్ పూలింగ్ పేదలకు ఇళ్లను నిర్మించేందుకోసమే. 
 
వైజాగ్‌లో 1.76 లక్షల మంది ఇల్లులేని పేదలున్నారు. నిబంధనల ప్రకారమే మండలిలోని వికేద్రీకరణ బిల్లులపై నిర్ణయం తీసుకుంటాం.
 
ప్రస్తుత పరిస్థితుల కారణంగా కొంత జాప్యం అవుతుంది తప్ప రాజధానుల ప్రక్రియ ఆగదు. టీడీపీ, వారికి వత్తాసు పలుకుతున్నవారికి సూటి ప్రశ్న. వికేంద్రీకరణకు మీరు అనుకూలమా, ప్రతికూలమా. శాసన మండలి విషయంలో కూడా చంద్రబాబు మాటలు గమనించాలి. గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు. చంద్రబాబుకు అనుకూలంగా, రాజకీయ లబ్ది ఉంటే కరెక్ట్ అంటారు. లేదంటే విమర్శిస్తున్నారు.
 
ప్రభుత్వం అనేక కోణాల్లో ఆలోచించి, కమిటీలు వేసి నిర్ణయం తీసుకుంది. నిన్న చెత్త అన్నది ఇవాళ మంచిది ఎలా అవుతుంది. ఇప్పుడు జిఎన్ రావు కమిటీ మంచిది ఎలా అయ్యింది. చంద్రబాబుకు ఎప్పుడూ యు టర్న్, నిర్దిష్టంగా ఎప్పుడూ వుండరు. ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా, ఇతర అంశాలలో ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి చంద్రబాబు విధానాలే కారణం. శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి, పరిపాలన కోసం వికేంద్రీకరణ వైపు వెళ్తోంది అని అన్నారు.