1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (11:49 IST)

కోవిడ్ రోగులకు గుర్తింపు లేని ఆసుపత్రులు చికిత్స చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం : కృష్ణా కలెక్టర్

కోవిడ్  రోగులకు అధీకృత గుర్తింపు లేని ఆసుపత్రులు చికిత్స చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి. ఇంతియాజ్ హెచ్చరించారు.

కోవిడ్ రోగులకు ప్రభుత్వం నుండి అధీకృత  గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రులలోనే చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి. ఇంతియాజ్  ఒక ప్రకటనలో  స్పష్టం చేసారు.   

కోవిడ్  రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం నుండి అధీకృత  గుర్తింపు లేని ఆసుపత్రిలు, ఆర్.ఎం. పి . లు వద్దకు  కోవిడ్ లక్షణాలతో వచ్చే రోగులను ప్రభుత్వం గుర్తించిన కోవిడ్ ఆసుపత్రిలకు వెళ్లి   చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చి పంపాలని, అలాకాకుండా కోవిడ్  రోగులకు  చికిత్స  అందిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. 

కోవిడ్ వ్యాధికి గుర్తింపు లేని ప్రైవేట్ ఆసుపత్రులు , ఆర్.ఎం.పిలు  చికిత్సలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వారిపై గట్టి నిఘా పెట్టవలసి ఉందన్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ, రెవిన్యూ, పోలీస్ అధికారులు గట్టి నిఘా పెట్టి, అనుమానితులపై దాడులు నిర్వహించాలన్నారు.

కోవిడ్ రోగులకు అనధికారికంగా చికిత్స అందించే ఆర్.ఎం.పి లు, ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.