బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (09:21 IST)

భార్యపై భర్త లైంగిక దాడి.. తీవ్రంగా గాయపడి మహిళ మృతి

భార్యపై భర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇటీవల చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో ఆమె ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లాలోని ఇరువారం దళితవాడకు చెందిన పద్మ అనే మహిళకు యాదమరి మండలం పాపిశెట్టిపల్లెకు చెందిన కూలి పనిచేసే నంద (37) అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయికి తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
అప్పటినుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి పద్మ ఆసుపత్రిలోనే ఉంటోంది. అయితే, తాగుబోతు అయిన నంద.. ఆదివారం పీకల వరకు మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చి... ఆస్పత్రిలోనే కోర్కె తీర్చమని బలవంతం చేశాడు. కుమార్తె అనారోగ్యంతో ఆస్పత్రిలో బాధపడుతుంటే ఇదేంపనంటూ ఆమె భర్తపై కోపగించుకుంది. ఇదే విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తాగుబోతు నందను బయటకు పంపించేశాడు. 
 
అయితే రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ ఆసుపత్రికి వచ్చిన నంద, తన భార్యను మభ్యపెట్టి పిల్లల వార్డు మిద్దెపైకి తీసుకెళ్లాడు. తన కోర్కెను తీర్చాలంటూ బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికిగురైన నంద విచక్షణ కోల్పోయి భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి చీరతో గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. 
 
తీవ్ర రక్తస్రావం మధ్య వివస్త్రగాపడున్న పద్మను సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆమె రెండో కుమార్తె గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చింది. అనంతరం పద్మను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినా కోలుకోకపోవడంతో ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. 
 
ప్రస్తుతం కోమాలో ఉన్న పద్మకు వైద్యులు చికిత్స అందిస్తూ రాగా, ఆమె చికిత్స ఫలించక కన్నమూసింది. భర్త లైంగికదాడిలో ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు రక్తస్రావం ఎక్కువ కావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికితోడు పద్మను చంపడానికి ఆమె చీరతోనే గొంతుకు బిగించడంతో మెడదుకు రక్త సరఫరా అయ్యే నాళాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఆమె ప్రాణాలు విడిచింది. పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా లైంగికదాడితో పాటు.. హత్య కేసుగా నమోదు చేశారు.