గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2019 (10:21 IST)

గ్లామర్‌తో రాజకీయాల్లో ఎదిగానా? లోకేశ్‌తో ఉన్న లింకేంటి: యామిని సాదినేని

తాను గ్లామర్‌తో రాజకీయాల్లోకి ఎదిగినట్టు సాగుతున్న ప్రచారంపై తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మహిళా ఫైర్‌బ్రాండ్ యామిని సాదినేని తోసిపుచ్చారు. పైగా, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఇద్దరు పిల్లల తల్లినని ఆమె చెప్పుకొచ్చారు. 
 
తాజాగా ఆమె ఓ టీవీ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం గ్లామరుతో రాజకీయాల్లో ఎదగడంపై తనకు పెద్దగా క్లారిటీ లేదన్నారు. తానేమీ ఓవర్ నైట్‌స్టార్ స్టేటస్ తెచ్చుకోలేదని, 2004 నుంచి సామాజిక సేవా రంగంలో, విపత్తు నిర్వహణ రంగంలో ఉన్నానని వెల్లడించారు.
 
హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు గారికి హ్యామ్ రేడియో ద్వారా తుపాను సమాచారం అందించానని వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలో మూడు నెలల పసిబిడ్డను కూడా వదిలేసి 13 జిల్లాలు బస్సుయాత్ర చేశానని వివరించారు. ఇంత కష్టపడ్డాను కాబట్టే, చంద్రబాబు ఆ కష్టాన్ని గుర్తించి పదవి ఇచ్చి గౌరవించారని యామిని చెప్పారు.
 
తన ఎదుగుదలలో అందం, వాగ్ధాటి కాకుండా, తన హార్డ్ వర్క్ ఫలితాన్నిచ్చిందని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే తన ఎదుగుదలను భరించలేకపోయారని, దాంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ విషయం తాను చంద్రబాబుకి తెలియజేసినా ఆయన ఎంతో బిజీగా ఉండడంతో చర్యలు తీసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో తానువైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. 'అలా అంటున్న వారిని నా ముందుకు తీసుకురాగలరా? నేను కూడా వాళ్ల ముఖాలు చూస్తాను' అంటూ యాంకర్‌ను తిరిగి ప్రశ్నించారు. 
 
తాను ప్రయత్నం చేశానని, వైసీపీ వాళ్లు తలుపులు మూసేశారని వస్తున్న కథనాలు వృథా మాటలని అభిప్రాయపడ్డారు. తానేమీ ఎంపీ, ఎమ్మెల్యే కంటెస్టెంట్ ను కాదని, తనకు ఎలాంటి ప్రయోజనాలు లేవని, ప్రజాసేవే పరమావధి అని చెప్పారు.