శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (15:18 IST)

నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితిని పెంచే యోచనలో జగన్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దిశగా సాధారణ పరిపాలన శాఖ కసరత్తు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వయో పరిమితిని 42 ఏళ్ల వరకు పెంచారు. ఆ జీవో గడువు ఇటీవలే ముగిసింది. దాంతో వయో పరిమితిని సడలించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. 
 
వయోపరిమితిని 42 ఏళ్ల కంటే అదనంగా ఏడాది లేదా రెండేళ్లకు పెంచే విషయమై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వయోపరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోవచ్చని, ఆ తర్వాత అధికారిక ఉత్తర్వులు విడుదల చేస్తారని తెలుస్తోంది. వయో పరిమితిని సడలించాలన్న ప్రభుత్వం ఆలోచన పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయో పరిమితిని పెంచడం ద్వారా తమకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.
 
జగన్ సీఎం అయ్యాక ఏపీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తున్నారు. సచివాలయాలను నెలకొల్పి లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. 2020 నుంచి ప్రతి ఏటా జనవరిలో కొత్త ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వ కొలువు కోసం సిద్ధం అవుతున్నారు.