1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (16:59 IST)

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

rushikonda palace
రుషికొండపై బ్లాకులతో అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.500 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని వెచ్చించి జగన్ జల్సా ప్యాలెస్‌ను నిర్మించారు. మొత్తం ఏడు బ్లాకులతో ఈ రాజప్రసాదాన్ని నిర్మించారు. అందులో మూడు జగన్ ఫ్యామిలీ కోసమే నిర్మించుకున్నారు. వీటిలో ఒకటి జగన్ - భారతీ దంపతుల కోసం కాగా, మిగిలిన రెండు తమ ఇద్దరి కుమార్తెల కోసం నిర్మించుకున్నారు. పర్యాటక రిసార్ట్స్ పేరిట నాలుగు ఎకరాలకు అనుమతి తీసుకుని ఈ ప్యాలెస్‌ను మాత్రం మొత్తం పది ఎకరాల్లో నిర్మించారు. 
 
ఈ ఏడు బ్లాకుల్లో ఏమున్నాయంటే... 
వేంగి 1(ఏ), 2(బి).. ఇవి రెండు బ్లాకులు. ఒకదానిలో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, రెండో దానిలో అతిథి గదులు. సమావేశమందిరాలు ఉన్నాయి. 
కళింగ : రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, సమావేశ మందిరాలు
గజపతి : హౌస్ కీపింగ్, కేఫ్ టేరియా, బిజినెస్ సెంటర్
విజయనగర 1, 2, 3 : ఇవి మూడు బ్లాకులు. ఒకటి జగన్, భారతి దంపతుల కోసం నిర్మించగా, మిగిలిన రెండు కుమార్తెలకు చెరొకటి చొప్పున నిర్మించారు. 
 
కుర్చీలు, టేబుళ్ల కోసం రూ.14 కోట్లు
జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్‌లో సోఫాలు, బల్లలు, కుర్చీలు, టేబుళ్ళు.. అంటే ఫర్నీచర్ కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.14 కోట్లు. ఎన్నికల్లో ఓడిపోయాక అక్కాచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు డబ్బులు పంచినా వారంతా ఓట్లేయలేదంటూ వాయిపోయిన జగన్... జనాలు జేబుల్లో నుంచి లాక్కొని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకుంటున్నారేమో. 
 
ఒక్కో ఫ్యాను ధర రూ.13 లక్షలు 
భవనమంతా సెంట్రలైజ్డ్ ఏసీ. కానీ, సీలింగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే. ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒక్కో ఫ్యాన్ ధరతో పేద కుటుంబం ఏడాదంతా జీవనం సాగించవచ్చు. తన జల్సా ప్యాలెస్ కోసం జగన్ రూ.3 లక్షలు పెట్టి ఒక్కో ఫ్యానును కొనుగోలు చేశారు. ఇలాంటి ఫ్యాన్లు మొత్తం ఈ ప్యాలెస్‌లో పదుల సంఖ్యలో ఉన్నాయి. 
 
ఇంటీరియర్స్ కోసం రూ.19.5 కోట్లు 
రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి. ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనే ఇంటీరియర్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వీటికోసం రూ.19.5 కోట్లు ఖర్చు చేశారు. ఇదంతా జనాల సొమ్మే. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆలోచన చేయని జగన్.. తన రాజసౌధానికి మాత్రం నిరంతరం ఆలోచన చేస్తూ ఏ హంగూ తగ్గకుండా చూసుకోవడం గమనార్హం. 
 
ఒక్కో షాండ్లియర్‌కు రూ.15 లక్షలు 
రుషికొండ ప్యాలెస్‌లో ఎటు చూసినా ధగధగలే. వీటన్నింటిని తలదన్నేలా సీలింగ్ మిలామిలా మెరిసిపోతోంది. సీలింగ్ మొత్తం ఖరీదైన షాండ్లియర్లతో నిండిపోయింది. జగన్ నివాసం ఉండాలనుకున్న బ్లాక్‌లో మొత్తం 7 షాండ్లియర్లు ఉన్నాయి. ఒక్కోదాని ధర రూ.15 లక్షలు ఇంకా భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు వేరే ఉంటుంది. 
 
కరెంట్ - నీరు - డ్రైనేజీ కోసం రూ.28 కోట్లు 
నీటి సరఫరా, కరెంట్, సీవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.28 కోట్లు. ఇదంతా ప్రభుత్వ ఖాతానుంచే. పని చేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కూలీలకు కూడా ప్రభుత్వం ఖజానా నుంచే రోజువారి కూలీ చెల్లించారు. 
 
గార్డెన్ కోసం రూ.22 కోట్లు 
ఇంటికి ఏ వైపున ఏ చెట్లు ఉండాలి.. ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన లైట్లు పెట్టాలి. ఖరీదైన మొక్కలు వాటి గార్డెన్‌ను ఎలా విలాసవంతంగా తీర్చిదిద్దాలని ఆలోచించి చేసిన ఖర్చు ఏకంగా రూ.22 కోట్లు.