గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (23:18 IST)

ఐదుగురిని లాగేస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా వుండదన్నారు కదా... (video)

ysjagan
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపా ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వైకాపా.. ముగిసిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. 
 
ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. 'ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా.. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది. 
 
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నాను. 1984లో లోక్‌సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 
 
1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లేకపోయినా పి.జనార్దన్‌ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను భాజపా కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నా' అని జగన్‌ పేర్కొన్నారు. 

ఐతే గత 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబుకి 23 మంది ఎమ్మెల్యేలు వున్నారనీ, ఐదారుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా వుండదని అన్నారు కదా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.