1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:03 IST)

'మా కొంపే కాదు.. మీ కొంపా ముంచుతుంది షర్మిల: బీజేపీ పెద్దలకు వైకాపా సూచన

ys sharmila
ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.షర్మిల సంధిస్తున్న ప్రతి ప్రశ్నకు, సంధిసున్న ప్రతి బాణానికి ఏపీలోని అధికార వైకాపా నేతలు ఏమాత్రం సమాధానాలు ఇవ్వలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైగా, గత నాలుగున్నరేళ్ల కాలంలో పెద్దగా చర్చకురాని ప్రత్యేక హోదా అంశం షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జోరుగా చర్చ సాగుతుంది. ఈ అంశంపై ఇటు వైకాపాను, అటు కేంద్రంలోని బీజేపీని నిలదీస్తున్నారు. ఇది పార్టీల నేతలకు పెద్ద సంకటంగా మారింది. జీర్ణించుకోలేకపోతున్నారు. "హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతానని చెప్పి ఇప్పటివరకు హోదా తీసుకురాలేదు" అంటూ షర్మిల తన ప్రసంగాల్లో తన అన్న, సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 
 
మరోవైపు, లోక్‌సభలో విభజన హామీలపై వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‍‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇచ్చారు. ఇది బీజేపీ పెద్దలకు నోట్లె పచ్చి వెలక్కాయపడిన చందంగా మారింది. దీంతో బీజేపీ పెద్దలు వైకాపాకు చెందిన ముఖ్య ఎంపీ ఒకరిని పిలిచి ఇదేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో షర్మిల అంశం ప్రస్తావనకు వచ్చింది. "ప్రత్యేక హోదా అంశాన్ని కావాలనే తెరపైకి తెస్తున్నారు. మేం ఎదురుదాడికి దిగాం. మీ పార్టీ నుంచి ఎవ్వరూ స్పందించడం లేదు. అలా వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో మాకే కాదు మీకూ నష్టం చేకూరుతుంది'' అని అన్నారు. దీంతో ఢిల్లీ బీజేపీ పెద్దలు షర్మిలపై ఎదురుదాడి చేయాలని ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.