1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:56 IST)

మహిళా ముఖ్యమంత్రిని చూడాలనివుంది... ఆ మహిళా సీఎం ఆమేనా? పీవీపీ ట్వీట్

వైకాపా నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ చేసిన ఓ ట్వీట్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్రకు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నానంటూ పీవీపీ చేసిన ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఈ ట్వీట్ గురించి ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నేతల కంటే వైకాపా నేతలే అధికంగా చర్చించుకుంటున్నారు. పైగా, ఈ ట్వీట్ సొంత పార్టీలోనే అమితమైన కాకను రేపింది. పీవీపీ చేసిన ట్వీట్‌లోని సారాంశాన్ని పరిశీలిస్తే, 
 
'బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ... మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్టర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి... కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు. ఆనాడు అన్న ఎన్టీఆర్‌ ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం' అంటూ ట్వీట్ చేశారు. 
 
పీవీపీ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే, కాసేపటి తర్వాత ట్వీట్‌ను ఆయన డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఈ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. వైయస్ భారతి? వైయస్ షర్మిళ? వైయస్ విజయమ్మ? వీరిలో ఎవరనే చర్చ జరుగుతోంది.
 
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెయిలుపై ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన తన భార్య వైఎస్. భారతికి ముఖ్యమంత్రి శిక్షణ ఇస్తున్నారనే ప్రచారం వైకాపా నేతలే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీవీపీ తాజాగా చేసిన ఆ మహిళా ముఖ్యమంత్రి ట్వీట్ ఆమెనుద్దేశించి అయినదే అయివుంటుందని భావిస్తున్నారు.