శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:05 IST)

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం : పాల్గొన్న వైకాపా నేతలు

విశాఖపట్టణంలోని ఉక్క కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటుపరం చేయనుందనే వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపింది. విశాఖ ఉక్క కర్మాగారంలో కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకోనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి అటు కేంద్రంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.
 
ఈ నేప‌థ్యంలో విశాఖ బాలచెరువు రోడ్‌ వద్ద అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నేతలు నిరసన సభ చేపట్టడంతో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా అక్క‌డ‌కు వెళ్లి నిరసనలో పాల్గొన్నారు.
 
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అవంతి శ్రీనివాస్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ఆ‌ ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు తామూ పోరాడుతామని స్ప‌ష్టం చేశారు. దాన్ని దీర్ఘకాలం పాటు పోరాడి సాధించుకున్నామ‌ని గుర్తు చేశారు. 
 
ఆ ఉక్కు పరిశ్రమ కోసం అప్ప‌ట్లో 32 మంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోదీ నిర్ణయం తీసుకున్నార‌ని చెప్పారు. ఆ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు.
 
మరోవైపు, విశాఖ ఉక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. లెటర్‌ హెడ్‌పై స్వయంగా రాసిన రాజీనామా లేఖను స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పంపినట్టు తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం కాగానే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజీనామా అన్నది తన వ్యక్తిగత నిర్ణయమన్నారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయి. విశాఖ ఉక్కును రక్షించుకోడానికి త్వరలోనే రాజకీయాలకు అతీతంగా సంయుక్త కార్యాచరణ కమిటీ (నాన్‌ పొలిటికల్‌ జేఏసీ) ఏర్పాటు చేస్తా. విశాఖ ఒడిలో పెరిగి, ఎదిగిన నాకు రుణం తీర్చుకునే అవకాశం ఈ విధంగా వచ్చినట్టు భావిస్తున్నా. 
 
సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగేలా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలి. విశాఖ ఉక్కు కు సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే గనులను కేటాయించి ఆదుకోవాలి. అలా చేస్తే టన్నుకు రూ.5 వేలు ఆదా అవుతుంది అని గంటా వివరించారు. 
 
కాగా, రాజీనామా లేఖ స్పీకర్‌ ఫార్మెట్‌లో లేనందున అది చెల్లుబాటు కాదని పలువురు ప్రస్తావిస్తున్న విషయంపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. అది పెద్ద విషయం కాదన్నారు. అవసరమైతే తన రాజీనామాను ఫార్మెట్‌లోనే పంపుతానని స్పష్టం చేశారు.