1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (22:41 IST)

వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాలు భేష్‌

వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా ద్వారా మహిళలకు ఎనలేని తోడ్పాటు లభిస్తుంది, ఇవి చాలా మంచిపథకాలని బ్యాంకింగ్‌ దిగ్గజాలు పేర్కొన్నాయి. చెప్పుకోదగ్గ డబ్బులు మహిళలకు చేరడం అభినందనీయమన్నాయి.

ఏడాదికి రూ.18,750ల చొప్పున, నాలుగేళ్లలో రూ.75వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించడం మంచి పరిణామమని ప్రశంసించాయి. ఈ పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తామని, తమ వంతు పాత్ర పోషిస్తామన్నాయి.

సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వివిధ బ్యాంకుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఫైనాన్స్‌ మరియు రీసోర్స్‌ మొబలైజేషన్‌ కార్యదర్శి సునీత, సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, మెప్మా ఎండీ విజయలక్ష్మీ, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌  బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ డీజీఎం అజయ్‌పాల్,
 స్త్రీనిధి ఎండీ నాంచారయ్య సహా ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. 

వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాలపై బ్యాంకుల ప్రతినిధులకు అధికారులు వివరించారు. ఈ పథకాల వెనుక ఉద్దేశాలు, ఆశిస్తున్న లక్ష్యాలను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ బ్యాంకుల ప్రతినిధులకు వివరించారు. స్థిర జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేయడానికి, మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి, సుస్థిర ఆర్థికాభివృద్ధికి ఈ పథకాలను తీసుకొచ్చామని వివరించారు.

చేయూత, ఆసరా పథకాలు కచ్చితంగా ఆదిశగా మహిళలను నడిపిస్తాయని బ్యాంకుల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తంచేశారు. అమూల్‌ సహా హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్‌ గాంబిల్‌ కంపెనీలతో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతాయన్నారు.

అమూల్‌కున్న విశేష అనుభవం, మార్కెటింగ్‌ నైపుణ్యాలు పాడి రంగంలో మంచి ఫలితాలను అందిస్తాయని, పాడిపశువులకు రుణాలు  ఇచ్చేందుకు సిద్ధమని బ్యాంకులు వెల్లడించాయి. ఇప్పటికే ఒక పాడిపశువు ఉన్నవారికి రెండో పాడి పశువుకు కూడా రుణాలు ఇచ్చేందు  సిద్ధమని ప్రకటించాయి.

వాటికి బీమా లాంటి సౌకర్యంకూడా అందిస్తామన్నాయి. అలాగే  ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్, హెచ్‌యూఎల్‌ ఉత్పత్తులు సరసమైన ధరలకు లభిస్తాయని, ఈ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న ప్రతిష్ట, డిమాండ్‌ మహిళలకు ఉపయోగపడతాయిని ఆశాభావం వ్యక్తంచేశాయి.

వీడియో కాన్ఫరెన్స్‌లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దినేష్‌ కుమార్‌ గార్గ్, ఇండియన్‌ బ్యాంకు ఈడీ ఎం కె భట్టాచార్య , పంజాబ్‌ నేషనల్‌బ్యాంకు ఈడీ రాజేష్‌ యదువంశీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈడీ రోహిత్‌ పటేల్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరపున సంజయ్‌ సహాయ్, కెనరా బ్యాంకు నుంచి షబ్బీర్‌ హుస్సేన్‌లు పాల్గొన్నారు.