అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
వైజాగ్ జిల్లా అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు, గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న ఈ కాఫీకి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే 'బిజినెస్ లైన్' చేంజ్ మేకర్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో 'ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్' విభాగంలో 'చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని అరకు కాఫీ కైవసం చేసుకుంది. గిరిజనుల జీవితాల్లో ఆర్థిక మార్పునకు దోహదపడినందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైభవంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా జీసీసీ వైస్ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పన కుమారి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అరకు కాఫీ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదని, అది గిరిజనుల ఆత్మగౌరవానికి, వారి శ్రమకు దక్కిన ప్రతీక అని పేర్కొన్నారు.
ఈ అద్భుతమైన విజయం వెనుక సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం ఉందని కల్పనకుమారి తెలిపారు. ఆయన దార్శనికత, ప్రోత్సాహం వల్లే జీసీసీ ఈ స్థాయికి చేరుకోగలిగిందని ఆమె వివరించారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, గిరిజన రైతుల అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ గుర్తింపు పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు.