శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 5 మే 2021 (16:58 IST)

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ ఎక్కడా జాప్యం ఉండకూడదు: సీఎం జగన్‌

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో ఆయన ఏమన్నారంటే..:
 
పనులు ఆగకూడదు:
జగనన్న కాలనీలలో జూన్‌ 1న పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్‌ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.
 
మోడల్‌హౌజ్‌–సమీక్ష:
ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్‌ హౌజ్‌ నిర్మించాలి. ఆ తర్వాత దానిపై సమగ్ర నివేదిక కూడా తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయొచ్చు.. వంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి.
 
మెటేరియల్‌ సేకరణ:
కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్‌ వినియోగం తగ్గుతుంది. దాని వల్ల రేట్లలో తేడా వచ్చే వీలుంది.
నిజానికి స్టీల్‌ ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిలో భాగంగానే, ఆక్సీజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ కావాలి. కాబట్టి స్టీల్‌ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి.ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే అస్సలు కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్‌ తప్పనిసరిగా అందించాలి.
 
అన్ని వసతులు ఉండాలి:
కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు, అక్కడ తగిన మౌలిక వసతులు కల్పించాలి. అలాగే లేఅవుట్‌ కూడా పక్కాగా ఉండాలి. సీసీ రోడ్డు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జెజెఎం), విద్యుద్దీకరణ, ఇంటర్నెట్‌.. మౌలిక వసతుల్లో ముఖ్య కాంపోనెంట్స్‌. కరెంటు, నీటి సరఫరాతో పాటు, రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు.
 
ఆర్థిక వృద్ధి కాబట్టి..:
కోవిడ్‌ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుంది.
ఎందుకంటే కార్మికులకు పని దొరుకుతుంది. అలాగే స్టీల్, సిమెంట్, ఇతర మెటేరియల్‌ కొనుగోలు వల్ల వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. కాబట్టి దీనికి చాలా ప్రయారిటీ ఇవ్వాలి.
ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్‌ అన్నది చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. 
 
భూగర్భ కేబుల్‌ వ్యవస్థ:
భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ వ్యవస్థదే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైప్‌లైన్లు, విద్యుత్‌ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. అయితే ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి.
 
అన్ని పనులు ఒకే ఏజెన్సీకి:
జగనన్న కాలనీ లేఅవుట్లలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, భూగర్భ ఇంటర్నెట్, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) పనులు.అయితే ఇవన్నీ వేర్వేరు శాఖల పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఒకే ఏజెన్సీకి అన్ని పనులు అప్పగించాలి.ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించండి.పనుల్లో డూప్లికేషన్‌ ఉండకూడదు, అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించండి.
 
అదనపు ఫండింగ్‌ కోసం..:
ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి, కేంద్రం నుంచి అదనంగా నిధులు కోరుదాం.
టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తుంది కాబట్టి, అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. ఇంకా, టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్‌ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.
 
కాగా, రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.
 
మొత్తం ఇళ్లు:
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, వైయస్సార్‌ అర్బన్‌–బీఎల్‌సీ తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్లు ఉన్నాయని, అందువల్ల వాటికి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాసినట్టు సమావేశంలో అధికారులు వెల్లడించారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, వాటి మంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేశామని వారు తెలిపారు. ఆ ఇళ్లలో ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో మ్యాపింగ్‌ జరిగిందని అధికారులు వివరించారు.
 
వచ్చే ఏడాది జూన్‌ నాటికి:
జగనన్న లేఅవుట్లలో జూన్‌లో పనులు మొదలు పెట్టి, సెప్టెంబరు నాటికి బేస్‌మెంట్‌ పనులు, డిసెంబరు నాటికి గోడల నిర్మాణాలు, ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్‌ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇంకా టిడ్కోలో చేపట్టిన ఇళ్లలో 81,040 ఇళ్లు దాదాపు పూర్తయ్యే దశ (90 శాతం పనులు)లో ఉండగా, మరో 71,448 ఇళ్లు దాదాపు 75 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 
 
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణద్వివేది, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్‌ గుప్తాతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.