గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:40 IST)

అయోధ్యపురిలో భవ్య రామమందిరాన్ని ఎలా నిర్మిస్తారో తెలుసా

కాగా, ఈ ఆలయ నిర్మాణం ఏవిధంగా చేపడుతారో పరిశీలిస్తే, వాస్తు శాస్త్రం ప్రకారం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం కొనసాగనుంది. దిగువ అంతస్తులోనే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మొత్తం ఐదు మండపాలు.. నృత్య మండపం, సింహద్వార్‌, పూజామండపం, రంగ్‌ మండపం, గర్భగృహం.. ఉంటాయి. 27 నక్షత్ర వాటికలను ఏర్పాటుచేస్తారు. 
 
భక్తులు తమ పుట్టిన రోజున ఇక్కడి చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. భూమిపూజ అనంతరం రామ్‌లల్లాను ఆలయ సముదాయంలోని శేషావతార్‌ ఆలయంలో తాత్కాలికంగా ప్రతిష్టిస్తారు. ఆలయ సముదాయంలో ప్రార్థనా మందిరం, ఉపన్యాస వేదిక, వేద పాఠశాల, సంత్‌ నివాస్‌, యాత్రి నివాస్‌లను నిర్మిస్తారు. ఆలయ నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ చేపట్టనుంది.
 
ఆలయం పొడవు, వెడల్పు, ఎత్తు.. అయోధ్య రామ మందిరాన్ని ఉత్తర భారతంలో ప్రఖ్యాతిగాంచిన 'నాగర శైలి'లో నిర్మించనున్నారు. ఇక.. రామాలయ నిర్మాణ ప్రధాన స్థపతి చంద్రకాంత్‌ సోంపుర (ఆయన తాత ప్రభాకర్‌జీ సోంపుర సోమనాథ్‌ ఆలయ నమూనా రూపకర్త). ఆలయ నిర్మాణానికి ఈయన 1983లో ప్రాథమిక డిజైన్‌ రూపొందించారు. తర్వాత 1998లో పూర్తిస్థాయి నమూనాను తయారుచేశారు. ఇప్పుడీ డిజైన్‌ను ఈయన కుమారులు నిఖిల్‌ సోంపుర, ఆశిష్‌ సోంపుర నవీకరించారు.
 
ఆలయం వెడల్పు 140 అడుగులు, పొడవు 268 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉండాలని చంద్రకాంత్‌ ప్రతిపాదించగా.. ఆయన కుమారులు ఎత్తు 161 అడుగులు, పొడవు 300 అడుగులు, వెడల్పు 268-280 అడుగులకు మార్చారు. పాత నమూనాలో 212 స్తంభాలు ఉపయోగించాలని భావించారు. 
 
అయితే, ఎత్తు, పొడవు, ఎత్తు పెరిగినందున సమతుల్యత కోసం 360 స్తంభాలు అమర్చాలని నిర్ణయించారు. 15 అడుగుల లోతున పునాదులు నిర్మిస్తారు. ఈ ఆలయ నిర్మాణం కోసం సుమారుగా రూ.300 కోట్లు, ఆలయంలో మౌలిక సదుపాయాల రూపకల్పన, గార్డెనింగ్ కోసం రూ.1000 కోట్లను ఖర్చు చేస్తారని అంచనా.