శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 3 జూన్ 2020 (13:10 IST)

నిసర్గ సైక్లోన్: ముంబయి దిశగా దూసుకొస్తున్న పెను తుఫాను

అరేబియా సముద్రంలో ముంబై దిశగా దూసుకొస్తున్న నిసర్గ తుఫాను పెను తుఫానుగా తీవ్రతరమైందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో హై-అలర్ట్ ప్రకటించారు. కొంకణ తీరంలో వర్షాలతో పాటు, ఈదురు గాలులు వీస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తుఫాను ముంబయి నగరానికి నైరుతిగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం చెప్పింది.

 
గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను.. మధ్యాహ్నం 1 గంటకు ముంబై - థానే జిల్లాల్లోకి ప్రవేశిస్తుందని.. మూడు గంటల పాటు తీరం దాటుతుందని ఐఎండీ తాజా బులెటిన్‌లో తెలిపింది. ఆ సమయంలో ముంబయి నగరంతో పాటు, థానే, రాయగడ జిల్లాల్లో గంటలకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతా పెను గాలులు వీస్తాయని చెప్పారు.

 
సైక్లోన్ నిసర్గ రాయగడ జిల్లాలోని అలీబాగ్‌ సమీపంలో దక్షిణంగా తీరం దాటవచ్చునని జాతీయ విపత్తు సహా దళం (ఎన్‌డీఆర్ఎఫ్) పేర్కొంది. తుపాను నేపథ్యంలో ఎన్‌డీఆర్ఎఫ్ సహాయ బృందాలను మహారాష్ట్రతో పాటు పొరుగున ఉన్న గుజరాత్‌లోనూ సంసిద్ధంగా ఉంచారు. తుపాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. మహారాష్ట్రలోని పలు తీర ప్రాంతాల నుంచి ఇప్పటివరకూ 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్‌డీఆర్ఎఫ్ కమాండెంట్ అనూప్ శ్రీవాస్తవ తెలిపారు.

 
129 ఏళ్ల కిందట...
“గాలి సముద్రాన్ని నగరంలోకి తీసుకొచ్చింది. అలలు భయంకరంగా గర్జించాయి. చర్చిల గోపురాలు ఎగిరిపోయాయి. భారీ రాళ్లు సుదూర ప్రాంతాలకు ఎగిరి పడ్డాయి. రెండు వేల మంది మరణించారు”. 1618 మే నెలలో వచ్చిన ఒక భయంకరమైన, శక్తివంతమైన పెను తుపానును వర్ణిస్తూ ఒక పోర్చుగీసు చరిత్రకారుడు చెప్పిన మాటలివి. 17వ శతాబ్దంలో భారతదేశ పశ్చిమ నగరాన్ని భయంకరమైన తుపానులు కమ్మేశాయి.

 
2005లో, ఇటీవల 2017, 2019లో కూడా ముంబయి నగరం ఎన్నో తీవ్రమైన వరదలు చూసింది. కానీ అవేవీ తుపానుల వల్ల వచ్చినవి కావు. “2 కోట్ల జనాభాతో కిక్కిరిసిన భారత ఆర్థిక, వినోద రాజధాని అయిన నగరం ఆధునిక చరిత్ర తుపానుల నుంచి తప్పించుకుంది. 1891 నుంచి ముంబయి పెను తుపానులను చూళ్లేదు” అని కొలంబియా యూనివర్సిటీలో వాతావరణ శాస్త్ర ప్రొఫెసర్ ఆడం సోబెల్ నాకు చెప్పారు.

 
100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో తీవ్రమైన నిసర్గ తుపాను బుధవారం భారత పశ్చిమ తీరాన్ని తాకినపుడు ఆ చరిత్ర మొత్తం మారిపోవచ్చు. భారీ వర్షం, పెను గాలులు సంభవించవచ్చునని, ఉప్పొంగే సముద్రం, ఎగసిపడే అలలు నగరంలో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 15 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో చాలా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి, 90 మందిని పైగా చంపిన ఆంఫన్ తుపానులాగే ఇది కూడా తీవ్రంగా ఉంటుందా అనేది గమనిస్తోంది.

 
ముంబయిలో రానున్న తుపాను గురించి పరిశోధన చేసిన ప్రొఫెసర్ సోబెల్ సోమవారం నాతో ‘నిసర్గ’గా చెబుతున్న ఈ తుపాను తాజా గతిని బట్టి ఇది గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ముంబయిపై పెను తుపానుగా విరుచుకుపడవచ్చని చెప్పారు. అమెరికా పద్ధతిలో చెప్పాలంటే ఇది ‘ఒక బలమైన ఉష్ణమండల తుపాను’, ‘హరికేన్’ లాంటిది కాదు అయన తెలిపారు. (ఉత్తర అట్లాంటిక్, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాల్లో వచ్చే వాటిని హరికేన్లు అంటారు)

 
“సూచించే ఆ తుపాను గతి ముంబయికి నష్టం కలిగిస్తుంది. కానీ, 12 గంటల క్రితం ఇది మరిం` శక్తివంతమైనదని చెప్పిన కొన్ని నమూనాలతో పోలిస్తే, దీని తీవ్రత తగ్గింది” అని ఆయన చెప్పారు. “అంటే, ఘోరమైన నష్టం జరిగే అవకాశం ఇప్పుడు చాలా తగ్గింది. అయినప్పటికీ, పెను తుపాను ప్రమాదకరంగానే ఉంటుంది. అందుకే ప్రజలు సన్నద్ధంగా ఉండాలి. పరిస్థితులు మారడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాతావరణ సూచనలు గమనిస్తుండాలి” అని ఆయన చెప్పారు. “కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంజి. అందుకే ముంబయికి ‘ఆరంజ్’ అలెర్ట్ ఇవ్వాలి” అన్నారు.

 
అటు కరోనా, ఇటు తుపాను
ముంబయి అంత బలహీనంగా ఎందుకు మారింది? అనే ప్రశ్నకు… అక్కడ జనసాంద్రత ఎక్కువ, లోతట్టు నగరం పూర్తిగా సముద్రానికి బహిర్గతం అవుతోంది. భయంకరమైన తుపాను లేదా భారీ వర్షాలు పడినపుడు నగరంలోని లోతట్టు ప్రాంతాలు సులభంగా వరద ముంపునకు గురవుతాయి. ఈసారీ, నగరం కోవిడ్-19 మహమ్మారితో కూడా పోరాడుతోంది. భారతదేశంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడోవంతు కేసులు మహారాష్ట్ర రాజధానిలోనే బయటపడ్డాయి.

 
గత కొన్ని దశాబ్దాలుగా అరేబియా సముద్రంలో తుపాను కార్యకలాపాలు పెరిగాయని వాతావరణ మార్పులపై విస్తృత కథనాలు రాసిన ప్రముఖ నవలా రచయిత అమితవ్ ఘోష్ చెప్పారు. అరేబియా సముద్రంలో శతాబ్దం చివరి నాటికి ఉష్ణమండల తుపానులు 46 శాతం పెరుగుతాయని 2012లో ఒక పత్రిక అంచనా వేసింది. 1998-2001 మధ్య మంబయికి ఉత్తరాన భారత ఉపఖండాన్ని మూడు తుపానులు తాకడంతో 17 వేల మంది చనిపోయారని ఆయన రాశారు.

 
తను రాసిన ‘ది గ్రేట్ డిరేంజ్‌మెంట్-క్లైమేట్ చేంజ్ అండ్ ది అన్ థింకబుల్’ అనే పుస్తకంలో ఆయన “కేటగిరీ 4 లేదా 5 తుపాను వస్తే, గంటకు 240 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే ముంబయి ఏమయ్యేది” అని రాశారు. “ముంబయి ఇంతకు ముందు పెను తుపానులను ఎదుర్కున్న సమయంలో, నగరంలో పది లక్షల లోపే నివసించేవారు. ఇప్పుడు 2 కోట్లకు పైగా జనాభాతో ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మునిసిపాలిటీ అయ్యింది” అని ఆయన అందులో చెప్పారు.

 
నగరంలో పెరగడంతోపాటూ, దాని నిర్మిత పర్యావరణం, వాతావరణం కూడా మారిపోయింది. అది అసాధారణం అనడంలో ఎలాంటి అర్థం లేదు. నగరంలో తరచూ తీవ్ర ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వర్షాకాలంలో కుండపోత వర్షాలు, ఈ మధ్య తరచూ వరదలు లాంటివి సంభవిస్తూనే ఉన్నాయి.

 
“ఏదైనా అసాధారణ ఘటన జరిగితే, ఆ ఫలితాలు విధ్వంసకరంగా ఉండవచ్చు”. ఇది ఇప్పటికే ఒకసారి జరిగింది. కానీ, ముంబయి నగర ప్రజలకు తుపాను అనుభవం ఎలా ఉంటుందో కూడా తెలీదు. ప్రపంచంలో ఒక్క రోజులో ఎక్కడా, ఎప్పుడూ నమోదు కాని విధంగా ముంబయి 14 గంటల్లో 94.4 సెంటీమీటర్ల వర్షపాతాన్ని రుచిచూసింది.

 
అప్పటి జలప్రళయం రోడ్లను ముంచెత్తింది. కమ్యూనికేషన్ నెట్‌వర్క్, విద్యుత్ సరఫరా ఆగిపోయింది. లక్షలమంది చిక్కుకుపోయారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. వరదలో కొట్టుకుపోయి, శిథిలాల కింద చిక్కుకుపోయి, కరెంటు షాకులకు, మునిగిపోయిన కార్లలో ఊపిరాడక 500 మందికి పైగా మరణించారు. అలాంటి ‘పీడకల’ మరోసారి రాకూడదని ముంబయి ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు.