గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 10 జూన్ 2020 (19:58 IST)

ఇండియా - నేపాల్ సరిహద్దు వివాదం: ‘లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా మావే...’ కొత్త మ్యాప్‌ ప్రతిపాదనకు నేపాల్ పార్లమెంటు ఆమోదం

వివాదాస్పద లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలతో కూడిన నేపాల్ కొత్త రాజకీయ మ్యాపుతో పాటు, కొత్త జాతీయ చిహ్నానికి సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనకు ఆ దేశ పార్లమెంటులో ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ కొత్త మ్యాపు.. 1816 సుగాలీ ఒప్పందం ప్రకారం లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉంటాయని చూపుతుంది. ఇదే మ్యాప్ జాతీయ చిహ్నంలో కూడా ఉంటుంది.

 
ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయటానికి ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై చర్చ చేపట్టి తుది ఆమోదం తెలుపటానికి కొంత సమయం పడుతుంది. బిల్లును ఉభయ సభలూ ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి బైద్యాదేవి భండారి బిల్లు మీద సంతకం చేసిన తర్వాత ఈ సవరణ అధికారికమవుతుంది.

 
అయితే.. లిపులేఖ్, కాలాపని, లింపియాధురా ప్రాంతాలకు సంబంధించి నేపాల్ వాదనలను భారత్ తిరస్కరిస్తోంది. అయితే.. ఒకవైపు పార్లమెంటులో చట్టం చేస్తుండగానే.. భూ వివాదాలను పరిష్కరించుకోవటానికి దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవాలన్న తమ సంకేతాలను భారత్ పట్టించుకోవటం లేదంటూ నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ ఆందోళన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 
దక్షిణ నేపాల్‌లోని లిపులేఖ్, లింపియాధుర, సుస్తాలు - రెండు నదీ సరిహద్దుల వివాదాలు ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ''సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుందామన్న మా విజ్ఞప్తికి ఎటువంటి స్పందనా రాకపోవటం మాకు కొంత దిగ్భ్రాంతి కలిగించింది'' అని మంత్రి ప్రదీప్ పేర్కొన్నారు. అయితే.. కోవిడ్19 సంక్షోభం సమసిపోయిన తర్వాత సరిహద్దు వివాదాలపై చర్చలు జరుపుతామని తాము నేపాల్‌కు తెలియజేసినట్లు భారత్ చెప్తోంది.

 
ఏమిటీ వివాదం...
టిబెట్‌లో ఉండే మానస సరోవర్‌కు వెళ్లే లిపులేఖ్ మార్గంలో ఓ సరిహద్దు రహదారిని భారత్ గత నెలలో ప్రారంభించింది. దీనిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాఠ్‌మాండూలోని వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఆ దేశ పార్లమెంటులోనూ భారత్ తీరుపై నిరసన వ్యక్తమైంది.

 
అంతకుముందు ఆరు నెలల క్రితం జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త రాజకీయ మ్యాప్‌లో లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్‌లను భారత్ తమ భూభాగాలుగా చూపించింది. అయితే, ఇవి తమ భూభాగాలని నేపాల్ చాలా కాలంగా వాదిస్తోంది. 1816 ఆంగ్లో-నేపాల్ సుగాలీ ఒప్పందం ప్రకారం మహాకాలీ నది మొదలయ్యే ప్రాంతం లింపియాధుర అని నేపాల్ పదేపదే అంటోంది. ఈ నదికి తూర్పునున్న ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తోంది.

 
కానీ, భారత ప్రభుత్వం మాత్రం మహాకాలీ నది లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలకు తూర్పున మొదలవుతుందని వాదిస్తోంది.