1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (16:03 IST)

ఇండిగోపై కేంద్ర మంత్రి ఫైర్.. చిన్నారిని అనుమతించరా?

indigo flight
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇండిగో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో సంస్థ విమానంలోకి అనుమతించని ఘటనపై మండిపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై తానే స్వ‌యంగా ద‌ర్యాప్తు చేస్తాన‌ని వెల్ల‌డించారు. 
 
ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డించారు. వివ‌క్ష‌తో కూడా ఈ చ‌ర్య‌ల‌ను స‌హించేది లేద‌ని తెలిపారు. ద‌ర్యాప్తు అనంత‌రం స‌ద‌రు సంస్థ‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. "ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదు. దీనిపై స్వయంగా నేను దర్యాప్తు చేపడతాను. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం" అని ట్వీట్ చేశారు. 
 
దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో సంస్థ విమానంలోకి అనుమతించని ఘటన రాంచీలో జరిగింది. చిన్నారి భయపడుతుండటంతో.. అతన్ని అనుమతించేందుకు నిరాకరించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అయితే.. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
శనివారం రాంచీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఓ కుటుంబం తమ దివ్యాంగ చిన్నారితో కలిసి ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే ఆ బాలున్ని విమానంలోకి అనుమతించేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. 
 
చిన్నారి భయాందోళనతో ఉన్నాడని... ఆ కారణంగా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. 
 
దీంతో బాలుడి పేరెంట్స్ ప్రయాణాన్ని విరమించుకున్నారు. మనీషా గుప్తా అనే కో ప్యాసెంజర్ ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.