శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 12 మార్చి 2019 (18:54 IST)

బైక్/ కారు కొంటున్నారా... ఈ నెలాఖరు వరకు ఆగండి.. లేకుంటే బాధపడతారు

బైక్ లేదా కారును మూడు వారాలు ఆగి కొనండి, ఒకవేళ ఇప్పుడే కొన్నట్లయితే చాలా బాధపడతారు. అదే 3 వారాల తర్వాత కొన్నట్లయితే బైక్‌పై రూ.20 వేల వరకు, కారుపై లక్ష రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది ఎలా అనుకుంటున్నారా.? అదేనండీ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి ఫేమ్ 2 పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీకి సంబంధించింది. 
 
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది. ఫేమ్ 2 పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహక మొత్తం లభించనుంది.
 
35,000 కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందవచ్చు. 5 లక్షల ఈ-రిక్షాలకు ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. 7,090 ఇ-బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సీడీ లభించనుంది. హైబ్రిడ్ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000-20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు, 2020-21లో రూ.5,000 కోట్లు, 2021-22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధరలో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20% ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.