శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:03 IST)

విమాన ప్రయాణం మరింత ప్రియం... ఫ్లైటెక్కాలంటే జేబుకు చిల్లే

దేశంలో విమాన ప్రయాణం మరింత ప్రియంకానుంది. ఇకపై ఫ్లైటెక్కాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే. దేశీయ విమాన ప్రయాణ టికెట్ ధరలను పది నుంచి 30 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. 
 
గతేడాది మే నుంచి జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన కేంద్రం.. సవరించిన చార్జీలు ఈ ఏడాది మార్చి 31 వరకు , లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
 
సవరించిన చార్జీల ప్రకారం.. ప్రయాణకాలం 40 నిమిషాల వరకు ఉంటే రూ.200 నుంచి గరిష్టంగా రూ.1,800 వరకు, 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ కాలానికి రూ.300-రూ.2,700, 90 నిమిషాల వరకు ఉంటే రూ.300-రూ.2,800, 60 నుంచి 90 నిమిషాల వరకు ఉండే ప్రయాణకాలానికి కనిష్టంగా రూ.300 నుంచి గరిష్టంగా రూ.2,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
 
ప్రయాణ కాలం 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటే రూ.400 - రూ.3వేలు, ప్రయాణ కాలం 120 నిమిషాల నుంచి 150 నిమిషాల వరకు ఉంటే రూ.500 - రూ.3,900, 150 నిమిషాల నుంచి 180 నిమిషాల వరకు ఉండే ప్రయాణ కాలానికి కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.4,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ కాలం 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే కనిష్టంగా రూ.700 నుంచి గరిష్టంగా రూ.5,600 వరకు చేతి చమురు వదిలించుకోక తప్పదన్నమాటే.