శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:04 IST)

విజయ్ మాల్యా పట్ల ఆర్బీఐ గిఫ్ట్ : రూ.1,915 కోట్ల రుణాలు రద్దు

దేశ ఖజానాను రుణాల పేరుతో లూఠీ చేసిన విదేశాలకు పారిపోయి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు భారత రిజర్వు బ్యాంకు పెద్ద గిఫ్టు ఇచ్చింది. ఆయన చెల్లించాల్సిన రూ.1915 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అలాగే, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన ఏకంగా రూ.68,607 కోట్లను కూడా రద్దు చేసింది. వీరిలో అనేక మంది బడా పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
ఇండియాలోని టాప్ విల్ ఫుల్ డిఫాల్టర్లు, వారు తీసుకున్న రుణాల పరిస్థితి తనకు తెలియజేయాలని గోఖలే ఫిబ్రవరి 16నదరఖాస్తు చేశారు. దీనికి ఆర్బీఐ ఏప్రిల్ 24వ తేదీన సమాధానమిచ్చింది. ఇందులో ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ముద్రపడి, దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా, మేహుల్ చౌక్సీలు సహా, 50 మంది టాప్ డిఫాల్టర్లకు చెందిన రూ.68,607 కోట్ల విలువైన బకాయిలను రద్దు చేసినట్టు సమాధానమిచ్చింది. 
 
ఇక ఆర్బీఐ ఇచ్చిన వివరాల మేరకు.. విల్ ఫుల్ డిఫాల్టర్స్ జాబితాలో విదేశాలకు చెక్కేసిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ యజమాని మెహుల్ చోక్సీ తొలి స్థానంలో నిలిచారు. ఆయన చెల్లించాల్సిన రూ.5,492 కోట్లు రద్దయ్యాయి. ఆయనకే చెందిన గిలి ఇండియా, నక్షత్ర బ్లాండ్స్ రుణాలు కూడా రైటాఫ్ అయ్యాయి. 
 
ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఎఫ్ఎంసీజీ సంస్థ ఆర్ఈఐ ఆగ్రో లిమిటెడ్ (రూ. 4,314 కోట్లు), జతిన్ మెహతా విన్‌‌‌సమ్ డైమండ్స్ అండ్ జ్యూయెలరీ లిమిటెడ్ (రూ.4,076 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం లండన్‌‌‌లో ఉంటున్న యూబీ గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ విజయ్ మాల్యా కంపెనీలకు సంబంధించి రూ.1,943 కోట్ల రుణాలు కూడా రద్దయ్యాయి.