శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (13:27 IST)

కరోనా మహమ్మారి.. కేంద్రానికి విజయ్ మాల్యా విజ్ఞప్తి

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విన్నపం చేశారు. బ్యాంకులను మోసం చేసి లండన్‌కు చెక్కేసిన విజయ్ మాల్యా.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. 
 
కరోనా నేపథ్యంలో ఊహించని విధంగా యావత్ దేశాన్ని భారత ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. లాక్ డౌన్ కారణంగా తన కంపెనీల కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఉత్పాదన ఆగిపోయింది. మా సంస్థల్లో పని చేస్తున్నవారిని ఇంటికి పంపలేకపోతున్నాం. వారికి తగిన వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం సహకరించాలని ట్వీట్ చేశారు. తమ ఉద్యోగులను ఇంటికి పంపించడానికి సహకరించాలని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తన మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి వింటారని ఆశిస్తున్నానని చెప్పారు.
 
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ఆఫర్ చేశానని మాల్యా చెప్పారు. తన నుంచి డబ్బు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. అలాగే అటాచ్ చేసిన తన ఆస్తులను రిలీజ్ చేసేందుకు ఈడీ ముందుకు రాలేదని విజయ్ మాల్యా అసహనం వ్యక్తం చేశారు.
 
భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు అణా పైసాతో సహా  చెల్లిస్తానని మాల్యా విజ్ఞప్తి చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తీసుకున్న అప్పు 100 శాతం చెల్లిసానని ట్వీట్ చేశారు. కానీ బ్యాంకులు తన విన్నపాన్ని అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా పట్టించుకోవడం లేదన్నారు. జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాలని కోరారు.