గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:44 IST)

ముగిసిన ఆంధ్రా బ్యాంకు అధ్యాయం ... యూనియన్ బ్యాంకుగా అవతరణ

దేశంలో ఉన్న బ్యాంకుల్లో ఆంధ్రా బ్యాంకు ఒకటి. ప్రస్తుతం ఈ బ్యాంకు చరిత్ర ముగిసిపోయింది. 97 యేళ్లుగా సేవలు అందిస్తూ వచ్చిన ఆంధ్రా బ్యాంకు అధ్యాయం ముగిసిపోయింది. ఈ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. దీంతో ఇక ఆంధ్రా బ్యాంకు శాఖలన్నీ యూనియన్ బ్యాంకు పరిధిలోకి వచ్చాయి. 
 
బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేశారు. దీంతో ఆంధ్రా బ్యాంకు చరిత్రలో కనుమరుగైంది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రావడంతో ఇకపై ఆంధ్రాబ్యాంక్‌ లోగోకు బదులు యూనియన్‌ బ్యాంకు లోగో లేదా కొత్త లోగో దర్శనమిస్తుంది.
 
కాగా, ఈ బ్యాంకును ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో స్థాపించారు. 1980 ఏప్రిల్‌లో జాతీయ బ్యాంకుగా అవతరించింది. 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలకు ఆంధ్రాబ్యాంకు విస్తరించింది. 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారాన్ని ప్రారంభించింది. 
 
అంతటి చరిత్ర ఉన్న బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ చాలారోజులపాటు ఉద్యోగులు ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తననుకున్నట్టే విలీన ప్రక్రియను పూర్తిచేసింది. అయితే లోగో మారినా బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయాలు, లీడ్‌ బ్యాంకు కార్యాలయాలు యథావిధిగా అదే భవనాల్లో కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.