బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

దేశంలో పెట్రోల్ ధరలు బాదుడే.. బాదుడు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చమురు ధరలను ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుతూ పోతున్నాయి. అయినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కూడా మరోమారు ధరలు పెరిగాయి. 
 
గత శుక్రవారం ధరలు పెరగా.. శనివారం పెరుగలేదు. కానీ, ఒక రోజు తర్వాత మళ్లీ ధరలు పైకి కదిలాయి. అంతకుముందు బుధవారం ధరలు పెంచాయి. రోజు విడిచి రోజు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. 
 
తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58, డీజిల్‌ రూ.83.22కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.98.88, డీజిల్‌ రూ.90.04, చెన్నైలో పెట్రోల్‌ రూ.94.34, డీజిల్‌ రూ.88.07, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.92.67, డీజిల్‌ రూ.86.06, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.21, డీజిల్‌ రూ.90.73కి చేరాయి. 
 
ఇప్పటి వరకు నెలలో తొమ్మిది సార్లు పెట్రోల్‌ రేట్లు పెరిగాయి. తాజా పెరు‌గు‌ద‌లతో దేశ‌వ్యా‌ప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.103.52, డీజిల్‌ రూ.95.99కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని అనొపురలో పెట్రోల్‌ రూ.103.21, రెవాలో రూ.102.85, ఇండోర్‌, భోపాల్‌లో రూ.100 వంద దాటింది. అలాగే, మెట్రోపాలినట్ సిటీల్లో కూడా సెంచరీకి చేరువవుతున్నాయి.