1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (20:24 IST)

ప్రధానిగా నరేంద్ర మోడీ... ఆదానీ సంపదలో 4 రెట్లు పెరుగుదల

భారతదేశ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గౌతమ్ ఆదానీ సంపద ఈ యేడాది ఒక్కసారిగా పెరిగిపోయింది. భారత ప్రధానమంత్రి నరేదంద్ర మోడీకి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా పేరుగడించిన ఆదానీ.. ఇపుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా సంపద కూడబెట్టిన కోటీశ్వరుల్లో ఒకరిగా రికార్డులకెక్కారు. ఈ యేడాది ఆయన ఏకంగా దాదాపుగా నాలుగు రెట్లు పెరిగింది. 
 
కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో ఆయన దశ తిరిగిపోయింది. ఫలితంగా ఆయన సంపద ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. పోర్టులు మొదలు పవర్ ప్లాంట్లు వరకు విస్తరించారు. ఆదానీ కంపెనీల్లోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 
 
దీంతో ఆయన సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచంలోని ఇతర బిలియనీర్లందరికంటే ఆదానీ సంపదే గణనీయంగా పెరిగింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ కథనం ప్రకారం... 2021లో ఆదానీ సంపద 16.2 బిలినయన్ల నుంచి 50 బిలియన్లకు పెరిగింది. దీంతో ఆయన ఈ ఏడాది అత్యధిక సంపద కూడపెట్టిన బిలియనీర్లలో నెంబర్ వన్‌గా నిలిచారు. 
 
2021 ప్రపంచ కుబేరుడి స్థానం కోసం పోటీపడుతున్న ఎలన్‌ మస్క్, జెఫ్ బెజోస్‌లను సైతం ఆదానీ వెనక్కి నెట్టడం మరో విశేషం. ఒక్కటి మినహా ఆదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మొత్తం ఈ ఏడాది దాదాపు 50 శాతం మేర దూసుకెళ్లాయి. మరోవైపు ఇదే సమయంలో ఆసియా నెంబర్ వన్ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద 8.1 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.