1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (13:37 IST)

జీఎస్టీ పరిధిలోకి పెట్రో ధరలు : నిర్మలమ్మ ఏంటున్నారు?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగదలను సాకుగా చూపి దేశీయంగా పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచేశారు. ఫలితంగా దేశంలో ఇంతకుముందెన్నడూ లేనంతగా లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిపోయింది. దీంతో జనం గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ.. కేంద్రం మిన్నకుండిపోయింది. 
 
పెరుగుతున్న ధరలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, మేధావులు డీజిల్, పెట్రోల్ ధరలను వస్తు సేవల పన్ను పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే సుంకాలే మొత్తం ధరలో సగానికి పైగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చాయి. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 
 
లోక్‌సభలో ఫైనాన్స్ బిల్ 2021పై జరిగిన చర్చకు సమాధానంగా మాట్లాడిన నిర్మలా సీతారామన్, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలను తగ్గించాల్సివుందన్నారు. ఈ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే, కేంద్రం సుంకాలను రాష్ట్రాలతో పంచుకుంటుందని స్పష్టం చేశారు.
 
"నేడు జరిగిన చర్చ తరువాత నేనెంతో నిజాయతీగా ఆలోచించాను. ఎన్నో రాష్ట్రాలు దీన్ని పరిశీలిస్తున్నాయి. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించడానికి సానుకూలంగా ఉన్నాము. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలూ లేవు. అయితే, రాష్ట్రాలే ముందడుగు వేయాలి" అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.