1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (12:25 IST)

నీతి ఆయోగ్ చెప్పిందని ప్రైవేట్ పరం చేసేస్తారా? ఆర్. నారాయణమూర్తి

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడివుందని, అలాంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ చెప్పడం దారుణని సినీ నటుడు ఆర్.నారాయణ మార్తి అన్నారు. నీతి ఆయోగ్ చెప్పిందనీ ప్రైవేటుపరం చేస్తారా? అని ఆయన నిలదీశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాట స్ఫూర్తితో నేడు దానిని రక్షించుకోవడానికి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అప్పట్లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాటాన్ని వివరించారు. కర్మాగారాన్ని ఎలా సాధించుకున్నదీ చెబుతూ, నాటి పోరాట ఘట్టాలను పూసగుచ్చినట్టు వివరించారు. 
 
ఈ సందర్భంగా నాటి పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకున్నారు. నేడు అదే స్ఫూర్తితో కంపెనీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నారాయణమూర్తి అన్నారు. అంతేకాకుండా, 2014 వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల్లో నడిచిందన్నారు. కరోనా కారణంగా ఈ పరిశ్రమతోపాటు ప్రపంచంలోని అనేక పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లాయని గుర్తుచేశారు.
 
కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం తలొగ్గకుండా విశాఖ ఉక్కును నిలబెట్టేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 100 కార్పొరేట్ కుటుంబులకు భారత రిజర్వు బ్యాంకు రూ.84,432 కోట్లను రుణంగా ఇవ్వగా, అందులో రూ.62 వేల కోట్లను ఆర్బీఐ రద్దు చేసిందని ఆర్.నారాయణ మూర్తి గుర్తుచేశారు.