శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (18:45 IST)

మారటోరియం కాలంలో వడ్డీలా? ఆరోగ్యం కంటే డబ్బే ముఖ్యమా? సుప్రీం

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. దీంతో అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. దీంతో వివిధ రకాల రుణాలు తీసుకున్నవారు నెలవారీ ఈఎంఐలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మూడు నెలల పాటు మారటోరియం విధించాల్సిందిగా కేంద్రం సూచన చేసింది. 
 
దీంతో రంగంలోకి దిగిన భారత రిజర్వు బ్యాంకు ఈఎంఐ చెల్లింపులపై ఆగస్టు వరకు మారటోరియం విధించింది. కానీ, నెలవారీ వడ్డీలను మాత్రం వసూలు చేస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్బీఐ చర్యను అపెక్స్ కోర్టు తప్పుబట్టింది. కరోనా కష్టకాలంలో ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యం కాబోవని స్పష్టం చేసింది. 
 
మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ ఆర్బీఐను ఆదేశించింది. దీంతో గురువారం ఓ నివేదిక సమర్పించింది. అందులో ఆగస్టు 31 వరకు పొడిగించిన మారటోరియం కాలానికిగానూ వడ్డీ మాఫీ చేయాలంటే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని అందులో పేర్కొంది.
 
దీనిపైనే ఆర్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 'మీడియాకు లీకులు ఇస్తూ ఈ అంశాన్ని ఆర్బీఐ మరింత సంచలనం చేసేందుకు ప్రయత్నిస్తోంది' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. 'ఓ వైపు మారటోరియంకు అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయడం మరింత ప్రమాదకరం' అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా తొలుత మార్చి 1 నుంచి మే 31 వరకు ఈఎంఐలపై మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తర్వాత దీన్ని ఆగస్టు చివరి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో రుణ గ్రహీతలకు కొంత ఉపశమనం లభించినట్టైంది. కాగా వడ్డీ మాఫీ అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అంచనాలు రూపొందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.