శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (13:51 IST)

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!

యస్‌ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని, దాన్ని చెల్లించకుండా ఉన్న వ్యవహారంలో అడాగ్ (అనిల్ దీరూభాయీ అంబానీ గ్రూప్) చైర్మన్‌ అనిల్‌ అంబానీ, గురువారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరెట్‌) ఎదుట విచారణకు హాజరయ్యారు. ముంబైలోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. 
 
కాగా, అనిల్‌‌కు చెందిన 9 కంపెనీలు యస్‌ బ్యాంక్‌ నుంచి సుమారు రూ.12,800 కోట్లు రుణంగా తీసుకున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కంపెనీలు ఏవీ సకాలంలో రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో, రుణాలన్నీ నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరిపోయాయి. ఈ విషయాన్ని నిర్ధారించిన ఈడీ, అనిల్ అంబానీకి సమన్లు పంపించింది. 
 
యస్ బ్యాంకులో జరిగిన అవకతవకల కేసులో యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన అధికారులు, ఆయన్ను విచారిస్తున్నారు. ఇచ్చిన అప్పులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం చూపడం, నిరర్థక ఆస్తులు పెరిగిపోయిన కారణంతోనే బ్యాంకు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.