1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:34 IST)

తమిళనాడులో కరోనా బారినపడుతున్న చిన్నారులు...

తమిళనాడులో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టమాత్రం పడటం లేదు. ఫలితంగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. సోమవారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1173 కేసులు నమోదయ్యాయి. 11 మంది చనిపోయారు. అయితే, కరోనా వైరస్ బారినపడినవారిలో 31 మంది చిన్నారులు ఉండటం ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 12,746 మందికి పరీక్షలు నిర్వహించగా సోమవారం 2,091 మందికి  సంబంధించిన రిపోర్టులు వచ్చాయని, వీటిలో 98 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, మిగతా వారికి నెగటివ్ అని వచ్చిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ తెలిపారు. అయితే, సోమవారం మొత్తం 98 కరోనా కొత్త కేసులు నమోదైనప్పటికీ.. కరోనా రోగుల్లో ఒక్కరు కూడా చనిపోలేదని, ఇది కొంత ఊరట కలిగించే అంశమని వివరించారు. 
 
ఇకపోతే, కరోనా బారినపడిన వారిలో 31 మంది చిన్నారులు ఉన్నారనీ, వీరిని రక్షించేందుకు వైద్యులు అహర్నిశలు పాటుపడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 33,850 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా, 63,380 మంది 28 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నట్టు రాజేశ్ తెలిపారు. 
 
కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో బాధితులకు చికిత్స చేయడానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే, కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో కొత్తగా 34 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చినట్టు ఆమె వివరించారు.