శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (10:02 IST)

కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. మృతుల సంఖ్య తగ్గట్లేదు..

దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా, మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,660 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే 30 మంది చనిపోవడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 14,429 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించింది. కరోనా లక్షణాలతో 103 మంది చనిపోయారు. మరో 20,746 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,80,362 యాక్టివ్‌ కేసులున్నాయి. 
 
శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,291, తూర్పుగోదావరిలో 2,022 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 535, శ్రీకాకుళంలో 897 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున, విశాఖపట్నంలో పది, నెల్లూరులో తొమ్మిది, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎనిమిదేసి, గుంటూరు, విజయనగరంలలో ఏడుగురేసి, శ్రీకాకుళంలో ఆరుగురు, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురేసి, ప్రకాశంలో ఇద్దరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 10,634కు చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.దేశంలో కరోనా కొత్త కేసుల నమోదులో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.