బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (11:02 IST)

కరోనా కోవ్యాక్సిన్.. భారత్ ముందడుగు.. క్లినికల్ ట్రయల్స్‌కు పర్మిషన్

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ ముందు వరుసలో ఉంది. ఇతర దేశాలతో పోటీ పడుతూ మరీ పనిచేస్తుంది. కోవాక్సిన్ అనే కరోనా వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడానికి సర్వం సిద్ధం చేసింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సహకారంతో ముందుకు వెళ్తుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ప్రస్తుతం మరో కీలక దశలోకి ప్రవేశించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. 
 
18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 28,500 మందిని ఈ అధ్యయనం కవర్ చేసింది. 10 రాష్ట్రాలలో అంటే.. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, పాట్నా మరియు లక్నోతో సహా 19 ప్రదేశాల్లో ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి ట్రయల్స్ నిర్వహిస్తున్నామని భారత్ బయోటెక్ పేర్కొంది.
 
ట్రయల్స్ నిర్వహించడానికి వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్‌కి అనుమతి ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) యొక్క సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది. భారత్ బయోటెక్ అక్టోబర్ 2‌న డిజిసిఐకి దరఖాస్తు చేస్తూ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 
 
మొదటి, రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ మరియు జంతువులలో పరీక్షించిన అధ్యయనం తర్వాత ఆ డేటాను అంచనా వేసి తరువాత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) ప్యానెల్ అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసింది.