శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:06 IST)

భారత్‌లో కరోనా కల్లోలం.. 24గంటల్లోనే 3,300 మంది కరోనాతో మృతి

భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజు లోనే దాదాపు 3,300 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో 3 వేల కరోనా మరణాలు ఎప్పుడూ నమోదుకాలేదు. దేశంలో కొత్తగా 3వేల 285 కరోనా మరణాలు సంభవించాయి.
 
దీంతో కొవిడ్‌తో ఇప్పటిదాకా భారత్‌లో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. కరోనా మరణ మృదంగం సృష్టిస్తోన్న బ్రెజిల్‌లో కంటే నిన్న భారత్‌లోనే కరోనాతో ఎక్కువ మంది చనిపోయారు. ఈ ఒక్క ఏప్రిల్‌లోనే భారత్‌లో దాదాపు 32 వేలకు పైగా మంది కరోనాతో మరణించారు. ఈ ఏడు రోజుల్లోనే 20 వేల మందికిపైగా మృతి చెందారు.
 
అటు పెరుగుతోన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 3 లక్షల 62 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రి ఇచ్చిన తర్వాత ఒక్కరోజులో ఇన్ని కేసులు ఎప్పుడు నమోదుకాలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే రోజుకు 4లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు రికార్డవడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో కరోనా కేసులు మొత్తం కోటీ 79లక్షలు దాటాయి.
 
నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2లక్షల 62వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29లక్షలు దాటేసింది. ప్రపంచంలో అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలుస్తోంది. కరోనా మరణాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
 
కరోనా విజృంభణతో దేశంలోని చాలా రాష్ట్రాలు ఆంక్షలు బాట పడుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ,కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఏపీ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు, వారాంతపు లాక్ డౌన్లు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి.
 
మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో కేంద్రం అలెర్ట్‌ అయింది. పాజిటివిటీ రేటు 15శాతంగా ఉన్న జిల్లాలను గుర్తించింది. దేశంలోని దాదాపు 150 జిల్లాల్లో పాజిటివిటీ శాతం అధికంగా ఉన్నట్లు తేల్చింది. ఈ 150 జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది.