మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (14:22 IST)

టీమిండియా భవిష్యత్ కెప్టెన్ రిషబ్ పంత్.. ప్రజ్ఞాన్ ఓఝా జోస్యం

భారత క్రికెట్ జట్టు భవిష్యత్ కెప్టెన్ రిషబ్ పంతేనని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన ఓఝా అభిప్రాయపడ్డాడు. రిషభ్‌ పంత్ ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చెందుతున్నాడని కితాబిచ్చాడు. రాబోయే సంవత్సరాల్లో రిషభ్‌ పంత్‌ పరిణతి చెందిన నాయకుడిగా అభివృద్ధి చెంది భవిష్యత్‌లో భారత జట్టుకు కెప్టెన్‌ అవుతాడని ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు.
 
కాగా, భుజం గాయం కారణంగా ఐపీఎల్ 14 సీజన్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ పగ్గాలను రిషబ్ చేపట్టాడు. ఇప్పటివరకు పంత్ ఆరు మ్యాచ్‌లకు నాయకత్వ బాధ్యతలు వహించగా.. నాలుగు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. 
 
మంగళవారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ పరాజయం పాలైంది. ఈ మ్యాచులో రిషభ్ పంత్ (58; 48 బంతుల్లో 6 ఫోర్లు) రాణించగా.. హెట్‌మైర్‌ (53; 25 బంతుల్లో 2×4, 4×6) చివర్లో ధాటిగా ఆడాడు.
 
దీనిపై ఓఝా స్పందిస్తూ, 'జట్టును నడిపించే విధానం, బ్యాటింగ్‌లో ఇదే విధమైన పరిపక్వతను కొనసాగిస్తే పంత్ భవిష్యత్‌లో భారత జట్టు కెప్టెన్‌ అవుతాడనే నమ్మకం నాకుంది. రిషభ్ గురించి తెలుసుకుని.. ప్రజలతో మాట్లాడిన తర్వాత అతడు టీమిండియాకు కెప్టెన్‌గా ఉండాల్సిన వ్యక్తిగా భావిస్తున్నా' అని ఓజా చెప్పుకొచ్చాడు. 
 
'సౌరవ్ గంగూలీ.. ధోనీలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి వెలుగులోకి తెచ్చాడు. పంత్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. దానికింకా చాలా సమయం ఉంది. కానీ ప్రస్తుతం పంత్..తనను తాను ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చేసుకుంటున్న విషయాన్ని నిశితంగా గమనించాలి. రవిశాస్త్రి భాయ్‌( టీమిండియా ప్రధాన కోచ్‌) శిక్షణలో పంత్‌ రాటుదేలుతాడని భావిస్తున్నా' అని ఓఝా చెప్పుకొచ్చాడు.