శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:03 IST)

ముంబై హాస్టల్‌లో 200 మందికి కరోనా.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు

corona virus
భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా తగ్గుతోందన్న కారణంగా ఇటీవలే స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. వాటితో పాటే హాస్టళ్లూ తెరుచుకున్నాయి. 
 
అక్కడే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయని తాజా లెక్కల్లో తెలుస్తోంది. 327 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఓ హాస్టల్‌లో 200 మందికిపైగా కరోనా సోకడం కలకలం రేపింది. వాషిం జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థులు, సిబ్బంది సహా 229 మందికి కరోనా సోకింది.
 
అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ స్కూల్ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులంతా అమరావతి, హింగోలి, నాందేడ్, వాషిం, అకోలా, ముల్దానా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అందులోనూ ఒక్క అమరావతికి చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని క్వారంటైన్ చేశారు.
 
ఇక ముంబై నగరంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో మాస్క్ పెట్టుకోని వారితో ఫైన్లు వసూలు చేయిస్తూ ఉన్నారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఒక్క రోజులోనే ముంబైలో 14వేల 600 మందికి ఫైన్‌లు విధించి రూ.29 ల‌క్ష‌లు వ‌సూలు చేయ‌గా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద 22,976 మందికి ఫైన్ విధించ‌గా.. రూ.45.95 లక్షల వ‌సూలు అయిన‌ట్లు తెలిపింది.