శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (12:05 IST)

బంగ్లాదేశ్ ఆటగాళ్లు అదుర్స్.. అక్భర్ నిలబెట్టాడు.. కానీ సోదరి మరణ వార్త తెలిసి?

అండర్-10 ప్రపంచ కప్‌‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అద్భుతం చేశారు. అనూహ్య రీతిలో అండర్-10 ప్రపంచ కప్‌ను గెలిచి.. ఆ దేశ క్రికెట్ చరిత్రనే తిరగరాశారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ఫైనల్లో మూడు వికెట్లతో (డక్‌వర్త లూయిస్) పటిష్ట భారత్‌ను ఓడించారు. ఫలితంగా తొలి ప్రపంచకప్‌ను ఆ దేశానికి అందించారు. ఈ విజయంలో ఆ జట్టు కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 43 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. దేశానికి కప్ గెలిచి పెట్టడంలో అక్బర్ అలీ కీలక పాత్ర పోషించాడు. 
 
ఈ మ్యాచ్‌లో భాగంగా షహదత్‌ హుస్సెన్ (1) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అక్బర్ అలీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ... పర్వేజ్‌ ఇమాన్‌ (79 బంతుల్లో 7ఫోర్లతో 47)కు సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు కీలకమైన 41 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం ఇమాన్ ఔటవ్వగా.. అక్బర్ ఒంటరిపోరాటం చేశాడు. ఓపికగా ఆడుతూ తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 
 
కానీ అక్బర్‌ ఈ మెగా టోర్నీ ఆడుతుండగానే అతడి సోదరి ఖాదిజా ఖాతున్‌ మృతిచెందారని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ దినపత్రిక పేర్కొంది. జనవరి 22న కవలలకు జన్మనిచ్చిన ఆమె కన్నుమూశారని తెలిపింది. ఆమె మృతికి కొద్దిరోజుల క్రితమే జనవరి 18న గ్రూప్-సిలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అక్బర్ తన జట్టును గెలిపించడం ఆమె చూశారు. 
 
కానీ ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో తన సోదరుడు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించినా ఆమె చూడలేని పరిస్థితి ఏర్పడిందని ఆ పత్రిక రాసింది. ఇక తన సోదరి మరణ వార్తను తన కుటుంబ సభ్యులు తెలపలేదని, వేరే వాళ్ల ద్వారా అక్బర్‌ తెలుసుకున్నాడని అతని తండ్రి చెప్పాడని ఆ పత్రిక పేర్కొంది. చాలా సన్నిహితంగా వుండే తన సోదరి మృతి చెందిన విషయాన్ని అక్బర్ అలీ జీర్ణించుకోలేకపోతున్నాడని అతని తండ్రి తెలిపారు.