ఆసియా కప్ ట్రోఫీని ఇచ్చేందుకు నఖ్వీ నిరాకరణ - బీసీసీఐ వార్నింగ్
ఇటీవల దుబాయ్ వేదికగా ఆసియా క్రికెట్ కప్ టోర్నీ జరిగింది. ఇందులో భారత క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఆ ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా పాకిస్థాన్ మంత్రి మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకునేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ఆ ట్రోఫీని దుబాయ్లో ఏసీసీ కార్యాలయంలో భద్రంగా ఉంచడంతో పాటు తన అనుమతి లేకుండా ఎవరికీ ఇవ్వరాదంటూ నఖ్వీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఇది భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
తాజాగా నఖ్వికి బీసీసీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని సరైన పద్ధతిలో అప్పగించాలని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ఇ-మెయిల్ పంపింది. ఏసీసీ చీఫ్ నుంచి ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోతే అధికారిక మెయిల్ ద్వారా ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేస్తామని బోర్డు కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు.
అయితే, ఏసీసీ కార్యాలయంలో భారత జట్టుకు ట్రోఫీ అందజేయానికి సిద్ధంగా ఉన్నానని నఖ్వీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ మంత్రిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఎట్టిపరిస్థితుల్లో ట్రోఫీని స్వీకరించబోమని బీసీసీఐ తెగేసి చెప్పింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్గా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని తీసుకొనేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ట్రోఫీ ప్రదానం ఓ సమస్యగా మారింది.