1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (20:38 IST)

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా.. ధోనీకి థ్యాంక్స్: విరాట్ కోహ్లీ

సంప్రదాయ టెస్టు కెప్టెన్సీ నుంచి టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతనే శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా సేవలందించే అవకాశం ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు తనను కెప్టెన్‌గా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోనీకి విరాట్ కోహ్లీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. జట్టు విజయం కోసం తాను 120 శాతం ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా తనకు సహకరించిన ఆటగాళ్లు, కోచ్ రవిశాస్త్రికి థ్యాంక్స్ చెప్పాడు.
 
ఇంకా కోహ్లీ తన ట్వీట్‌లో నిజాయితీగా తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులున్నాయి. కానీ ఏనాడు ప్రయత్నించకుండా ఉండలేదు. తాను చేసే ప్రతి పనిలో 120 శాతం ఇవ్వాలని ఎప్పుడూ నమ్ముతాను. అలా చేయకపోతే తన మనసు ఏ మాత్రం అంగీకరించదు.
 
'గత ఏడేళ్లుగా జట్టును సరైన దిశలో నడిపించేందుకు ప్రతీ రోజు శ్రమించాను. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకొని వదిలిసేంది లేదు. ఇక ప్రతీ దానికి ఏదో దశలో ముగింపు పలికాలి. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను. అలా చేయకపోవడం సరైంది కాదు కూడా.
 
సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించే అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. తన లక్ష్యంలో తనతో నడిచిన తన సహచరులకు కృతజ్ఞతలు. వారే కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మరింత అందంగా మార్చారు. చివరగా తనను ఆటగాడిగా, కెప్టెన్‌గా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేక ధన్యావాదాలు'అని కోహ్లీ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.