1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 15 జనవరి 2022 (19:39 IST)

విరాట్ కోహ్లీ: టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా.. ధోనీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు

టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. విరాట్ కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అందులో 40 మ్యాచ్‌లను భారత జట్టు గెలవగా 17 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

 
తాజాగా దక్షిణాఫ్రికాలో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు 2-1 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి అనంతరం కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా టీ20 జట్టు కెప్టెన్‌గా కోహ్లీ ఇప్పటికే తప్పుకోగా వన్డే కెప్టెన్సీ నుంచి ఆయన్ను బీసీసీఐ తొలగించింది. ఆ తొలగింపుపై వివాదం కూడా చోటుచేసుకుంది. తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై చెప్పడంతో మూడు ఫార్మట్లలోనూ విరాట్ నాయకత్వం లేనట్లయింది.

 
‘నాపై నమ్మకం ఉంచిన ధోనీకి థాంక్స్’
‘‘జట్టును సరైన దిశలో నడిపించటానికి ఏడేళ్లుగా కష్టపడ్డాను, కఠినంగా శ్రమించాను, నిర్విరామంగా పనిచేశాను. పరిపూర్ణ నిజాయితీతో నా విధి నిర్వర్తించాను. ఏదీ వదిలిపెట్టలేదు. ప్రతీదీ ఏదో ఒక దశలో ముగింపు రావాల్సిందే. భారత టెస్ట్ కెప్టెన్‌గా ఇప్పుడు నాకు ఆ దశ వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తులున్నాయి. కొన్ని పల్లాలూ ఉన్నాయి. కానీ ఎన్నడూ ప్రయత్నలోపం లేదు. విశ్వాస లోపం లేదు.

 
నేను చేసే ప్రతి పనికీ నూటికి 120 శాతం నా శక్తిసామర్థ్యాలను వెచ్చించాలనే నేను ఎల్లప్పుడూ విశ్వసించాను. అలా చేయలేకపోతే అది సరైంది కాదని నాకు తెలుసు. నా హృదయంలో సంపూర్ణ స్పష్టత ఉంది. నా జట్టును నేను వంచించలేను. ఇంత సుదీర్ఘ కాలం నా దేశానికి సారథ్యం వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు బీసీసీఐకి నేను కృతజ్ఙతలు చెప్తున్నా. మరీ ముఖ్యంగా జట్టు కోసం నేను కన్న కలలను తొలి రోజు నుంచీ విశ్వసించిన, ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలని విశ్వాసంతో ఉన్న జట్టు సభ్యులకు దన్యవాదాలు చెప్తున్నా.