బుధవారం, 23 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (22:07 IST)

ఆ ఐదుగురి చిన్నారుల కల నెరవేరింది.. స్టార్ క్రికెటర్లను కలిసే ఛాన్స్!

Children
Children
భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ కాదు. కోట్లాది మందికి భావోద్వేగాలతో ముడిపడినది. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే క్రికెట్ అభిరుచి గల కమ్యూనిటీల్లో పెరుగుతూ, మనలో చాలా మంది పొరుగింటి టీవీల్లో మ్యాచ్‌లు చూస్తూ లేక రేడియోల్లో కామెంటరీలను వింటూ వచ్చాం.
 
మనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ హీరోలను కళ్లారా ఒక్కసారి చూడటం కావచ్చు లేదా ఉత్సాహకరంగా సాగే మ్యాచ్‌ను లైవ్‌లో చూడటం కావచ్చు ఇలాంటివన్నీ మనలో చాలా మందికి తీరని కలలుగానే ఉంటాయి. అయితే, పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్‌కి చెందిన అయిదుగురు బాలలకు మాత్రం ఈ కల సాకారమైంది. 
 
తమకి ఇష్టమైన క్రికెట్ స్టార్లను ప్రత్యక్షంగా చూడటమే కాదు భారత జాతీయ క్రికెట్ టీమ్ ఆటగాళ్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేసే అవకాశం వారికి దక్కింది. 
 
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీసీసీఐ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ ప్లాట్‌ఫాం ద్వారా పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్‌కి చెందిన అయిదుగురు బాలలకు సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ మెళకువలు నేర్పారు. 
 
బౌలింగ్ దాడిని ఎలా ఎదుర్కొనాలనేది బాలలు ఏస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నుంచి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వారికి బ్యాటింగ్ పాఠాలు నేర్పారు. ఈ చిరకాల కల సాకారమైన క్షణాలను బాలలు సంపూర్ణంగా ఆస్వాదించారు. 
 
ప్రాక్టీస్ నెట్స్‌లో ఆటగాళ్లు ఎలాంటి భేషజాల్లేకుండా తమతో కలిసిపోవడం, ఆటలాడటం వారికి జీవితాంతం గుర్తుండిపోయే, మరపురాని అనుభూతిని అందించింది. 
 
వెనుకబడిన బాలలకు విద్య, సమగ్రాభివృద్ధిలో తోడ్పాటు అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు బంగారు భవిష్యత్తు కోసం పెద్ద కలలు కనేలా, తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు కృషి చేసేలా వారిలో స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. 
 
పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్‌ బాలలతో క్రికెట్ స్టార్లు సమయం గడపడమనేది, చిన్న చిన్న విషయాలు సైతం పిల్లల మనస్సులో చెరగని ముద్ర వేస్తాయనడానికి, వారు పెద్ద కలలు కనడానికి స్ఫూర్తినిస్తాయనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. 
 
 
 
అయిదుగురు బాలలైన దీపికా ఎం, మైలారి ఎన్ (Mailari N), అనన్య వి, నవ ప్రణవ్, పౌగౌహావో ఎల్ (Paogouhao L)కి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ vs బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌ను చూసే అవకాశం కూడా లభించింది. 
 
ఈ చిన్నారులకు ఇలాంటి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించే కార్యక్రమంలో మేము కూడా పాలుపంచుకునే అవకాశం లభించడం హర్షణీయం. బీసీసీఐతో ఎస్‌బీఐ లైఫ్ భాగస్వామ్యమనేది కేవలం క్రీడకు మద్దతుగా నిలవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ప్రేరణనిచ్చేందుకు, పెద్ద కలలను కనేలా, అలాగే ఆ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేసేలా వారిలో స్ఫూర్తి నింపేందుకు తోడ్పడుతుంది.
 
పిల్లలతో మనస్ఫూర్తిగా ఆడేందుకు, వారిని కలిసేందుకు సమయం వెచ్చించిన సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ వంటి క్రికెట్ లెజెండ్‌లకు ధన్యవాదాలు. వారితో గడిపిన ఆ క్షణాలు ఈ చిన్నారులకు చిరకాలం స్ఫూర్తినిచ్చే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. 
 
పెద్ద కలలు కనేలా వారికి ప్రేరణనిస్తాయి. తరగతి గది లోపల, బైట కూడా తమ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేసేలా బాలలకు ఎల్లప్పుడు తోడుగా నిల్చేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు ఎస్‌బీఐ లైఫ్ కట్టుబడి ఉంటుంది.. అని ఎస్‌బీఐ లైఫ్ చీఫ్ ఆఫ్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్, అండ్ సీఎస్‌ఆర్ శ్రీ రవీంద్ర శర్మ తెలిపారు.
 
బెంగళూరులోని అణగారిన వర్గాల బాలల కోసం పాఠశాల, కళాశాలను నిర్వహించడంలో పరిక్రమకు ఎస్‌బీఐ లైఫ్ ఎనలేని తోడ్పాటు అందిస్తోంది. మాకు ఆర్థికంగా సహాయపడటమే కాకుండా మా పిల్లలకు వివిధ అవకాశాలను కూడా కల్పిస్తోంది. 
 
ఢిల్లీలో 20:20 క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు మా పిల్లల్లో కొందరిని ఆహ్వానించినందుకు గాను ఎస్‌బీఐఎల్‌కు కృతజ్ఞతలు. మా విద్యార్థులకు ఇలాంటి అనుభవం ఒక కీలకమైన జీవన నైపుణ్య పాఠంగా ఉండగలదని విశ్వసిస్తున్నాం. 
 
తామెన్నడూ ఎరుగని అనుభవాన్ని వారు తెలుసుకునేందుకు ఇదొక చక్కని అవకాశమవుతుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో మన దేశం తరఫున ఆడే క్రికెటర్లలో వారు కూడా ఒకరు కావచ్చేమో, ఎవరికి తెలుసు! జాతి నిర్మాణంలో మాకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు" అని పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సీఈవో శుక్లా బోస్ తెలిపారు.