1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (12:03 IST)

ఐపీఎల్ 2021 సందడి మొదలు.. చెన్నైకి చేరుకున్న ధోనీ..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సందడి మొదలైంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ చెన్నైకి చేరుకోవడంతో ఫ్రాంచైజీలో కోలాహలం నిండింది. నగరానికి చేరుకున్న అతడికి హోటల్‌, ఫ్రాంచైజీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. తన గదికి చేరుకుంటున్నంత సేపు మహీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. అతడు నగరానికి చేరుకున్న వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ ట్వీట్‌ చేసింది. 
 
అంతకుముందే అంబటి రాయుడు శిబిరానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసు పూర్తవ్వగానే చెతేశ్వర్‌ పుజారా సైతం శిబిరానికి చేరుకోనున్నాడు. ప్రాక్టీస్‌ మార్చి 9 నుంచి ఆరంభమవుతుందని సీఎస్‌కే తెలిపింది. ఏప్రిల్‌లో ఐపీఎల్‌-2021 సీజన్‌ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
భారత క్రికెటర్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటి వరకూ లీగ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కనీసం ప్లేఆఫ్‌కు కూడా అర్హత సాధించలేదు. ఈ సారైనా టైటిల్ కొట్టాలన్న కసితో ఉంది ధోనీసేన.
 
కాగా.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం కొత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఓపెనర్ రాబిన్ ఉతప్ప, స్పిన్ ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ, కె. గౌతమ్, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా వచ్చారు. ఐపీఎల్ 2021 సీజన్‌కు బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన 6 సిటీల్లో చెన్నైకి కూడా చోటు లభించింది.