1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (23:44 IST)

విరాట్ కోహ్లీ ఖాతాలో 'వ్యర్థ' రికార్డు ... ఏంటది? (video)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ వ్యర్థ రికార్డు (అనవసరపు రికార్డు) నమోదైంది. దీంతో కోహ్లీ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరసన చేశారు. ఆ అనవసరపు రికార్డు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ శుక్రవారం డకౌటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ విసిరిన ఓ షార్ట్‌పిచ్‌ బంతిని వేటాడబోయి కీపర్‌ ఫోక్స్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత క్రికెట్ జట్టు 41 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.
 
అయితే, కోహ్లీ ఇలా డకౌట్ కావడం ఇది ఎనిమిదోసారి. దీంతో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరసన కోహ్లీ నిలిచాడు. మహీ సైతం కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో ఎనిమిది సార్లు టెస్టుల్లో ఇలా సున్నా పరుగులకే ఔటయ్యాడు. దీంతో వీరిద్దరూ భారత్‌ తరపున అత్యధిక డకౌట్లు అయిన టెస్టు కెప్టెన్లుగా రికార్డులకెక్కారు. 
 
మరోవైపు విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో ఒక సిరీస్‌లో రెండుసార్లు డకౌటవ్వడం ఇది రెండోసారి. 2014లోనూ ఇంగ్లండ్‌ జట్టు చేతిలోనే టీమ్‌ఇండియా సారథి ఒకే సిరీస్‌లో రెండు సార్లు పరుగులు చేయకుండా పెవిలియన్‌ చేరాడు.
 
ఇక ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌.. విరాట్‌ను ఔట్‌ చేయడంతో టెస్టుల్లో అత్యధికంగా ఐదు సార్లు పెవిలియన్‌ చేర్చాడు. మరే బ్యాట్స్‌మెన్‌ కూడా స్టోక్స్‌ చేతిలో ఇన్నిసార్లు వికెట్‌ సమర్పించుకోలేదు. డీన్‌ ఎల్గర్‌, మైఖేల్‌ క్లార్క్‌, చేతేశ్వర్‌ పుజారా ఇదివరకు నాలుగు సార్లు స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. 
 
కాగా, ఈ టెస్టుతోనే విరాట్‌ ప్రస్తుతం ధోనీకి సంబంధించిన మరో రికార్డునూ సమం చేశాడు. భారత్‌ తరపున అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ వహించిన మహీ రికార్డు(60)ను కోహ్లీ చేరుకున్నాడు. అలాగే ఇంతకుముందు మూడో టెస్టులో భారత్‌ విజయం సాధించడంతో స్వదేశంలో అత్యధిక మ్యాచ్‌లు గెలుపొందిన కెప్టెన్ల జాబితాలో ధోనీ(21)ని కోహ్లీ(22) అధిగమించాడు.