శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:43 IST)

మొతేరా పింక్ బాల్ టెస్టు.. కోహ్లీ కోసం ఆ రికార్డ్ వెయిటింగ్..?

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొతేరా వేదకగా మూడో టెస్టు జరుగనుంది. ఈ టెస్టు డేనైట్ (పింక్ బాల్) మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. మొతెరా వేదికగా బుధవారం నుంచి డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది.
 
మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. స్వింగ్ కు అనుకూలించే పిచ్‌లపైనే ఇంగ్లండ్‌ను ఓడించామని.. పేస్‌కు అనుకూలించే వాళ్ల సొంత మైదానాల్లోనే వారిని ఓడించామని తెలిపాడు. బలహీనతలు గురించి మాట్లాడితే.. ప్రత్యర్థి జట్టులో అవి చాలానే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేస్ ‌పిచ్‌ వాళ్లకు అనుకూలంగా ఉంటే.. అది మాకు లాభమే.
 
ఎందుకంటే.. ఇతర జట్ల కంటే బలమైన బౌలింగ్ దళం మాకు కూడా ఉందని అన్నాడు కోహ్లీ. భారత్ పేస్ అటాక్ కూడా ఎంతో స్పెషల్ అని అన్నాడు. పింక్ బాల్ తో ఆడటం సవాల్ తో కూడుకున్నదని అన్నాడు. లైట్ల వెలుతురులో తొలి గంటన్నర ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పాడు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని కూడా కోహ్లీ చెప్పుకొచ్చాడు.
 
ఇక మరో విజయాన్ని అందుకుంటే స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్ గా ధోనీ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు. ఈ రికార్డుపై కోహ్లీ మాట్లాడుతూ, అలాంటి విషయాలను తాము పట్టించుకోమని చెప్పాడు. రికార్డులు అస్థిరమైనవని అన్నాడు. ధోని పై తమకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంటాయని చెప్పాడు. చివరి రెండు టెస్టులు గెలవాలనే తాము ఆడతామని అన్నాడు.
 
అలాగే మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ సాధిస్తే.. ప్రపంచంలో మూడో బ్యాట్స్‌మన్‌గా, పింక్ బాల్ టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి సారథి‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. విరాట్ నుండి సెంచరీ వచ్చి చాలా కాలమే అవుతోంది. 
 
ధోనీ సారథ్యంలో టీమిండియా భారత్‌లో 21 విజయాలు సాధించగా.. కోహ్లీ నేతృత్వంలో 21 విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లీ మరో టెస్ట్ విజయం సాధిస్తే ధోనీకి చెందిన ఈ రికార్డును అధిగమిస్తాడు.